
LPG Allocation Rules: మధ్యప్రాచ్య సంక్షోభం ప్రస్తుతానికి ముగిసింది. ఇరాన్-అమెరికా రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించాయి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పిజి, చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. యుద్ధం ప్రస్తుతానికి మాత్రమే ముగిసింది. అంటే ఇరు దేశాల మధ్య చర్చలు కారణంగా రెండు వారాల పాటు మాత్రమే యుద్ధాన్ని తాత్కాలికింగా నిలిపివేశారు. మరి భారతదేశంలోని ఎల్పిజి సంక్షోభం పరిష్కారమవుతుందా? ఎల్పీజీ సంక్షోభం మధ్యలో భారత ప్రభుత్వం ఒక పెద్ద ప్రకటన చేసింది. కొత్త ఎల్పీజీ కేటాయింపులను ప్రకటించింది. ఇకపై ఎల్పీజీ సిలిండర్లు మొదట ఎవరికి లభిస్తాయి?

ఫార్మాస్యూటికల్, ఆహార, ఆహార శుద్ధి, పాలిమర్, ప్యాకేజింగ్, పెయింట్, ఉక్కు, సిరామిక్, గాజు, వ్యవసాయ రంగాలలో ఉపయోగం కోసం మరింత ఎల్పిజిని కేటాయించనున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ ఆర్థిక స్థిరత్వం, సరఫరా గొలుసును నిర్వహించడానికి ఈ రంగాలు అత్యవసరమైనవిగా పరిగణిస్తారు. అందువల్ల, ఈ రంగాలలో ఎలాంటి ఎల్పిజి సంక్షోభాన్ని నివారించడానికి ఇక్కడ భారీ సరఫరా అందిస్తారు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఈ రంగాలకు ఇప్పుడు మార్చికి ముందు, అంటే ఇరాన్-అమెరికా యుద్ధం, ఎల్పిజి సంక్షోభానికి ముందు వారు అందుకుంటున్న ఎల్పిజిలో 70 శాతం వరకు సరఫరా చేయబడుతుంది. మొత్తం రంగానికి రోజుకు 200 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా సహజ వాయువును ఉపయోగించలేని ఫ్యాక్టరీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. నిరంతరాయ సరఫరాను కొనసాగించేందుకు ఈ ప్రాంతాలకు ముందుగా ఎల్పీజీని సరఫరా చేస్తారు.

పైపుల ద్వారా సహజ వాయువు (PNG) సేవలు అందుబాటులో ఉన్న రాష్ట్రాలలో కొత్త కనెక్షన్ల కోసం పారిశ్రామిక ప్రాంతాలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవాలని కోరింది ప్రభుత్వం. ఎల్పిజి సంక్షోభం తర్వాత ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంపై, ముఖ్యంగా పిఎన్జిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

వలస కార్మికులు, పేదల కోసం కేంద్రం ఒక పెద్ద ముందడుగు వేసింది. 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల కొనుగోలు నిబంధనలను సడలించారు. ఇకపై గుర్తింపు కార్డుతో మాత్రమే 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లను కొనుగోలు చేయవచ్చు. చిరునామా రుజువు అవసరం లేదు. కేంద్రం గణాంకాల ప్రకారం, మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా 7.8 లక్షల 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయి.