
New Car: కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు చేస్తే బెటర్. ఎందుకంటే శనివారం నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ధరల పెంపు నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి రానుంది.

మరికొన్ని ఇతర కంపెనీలు కూడా ధరల పెంపును ప్రకటించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కారు బుక్ చేసుకున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని, పాత ధరలే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. మే 7 లోపు కార్లను బుక్ చేసుకున్న వారికి ధర పెంపు ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.

మిగతా వారికి పెరిగిన ధరలే వర్తించనున్నాయి. స్టీల్, ఇతర లోహాల ధరలు పెరగడం వల్ల కార్ల ధరలు పెంచాల్సి వచ్చిందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్) శైలేశ్ చంద్ర తెలిపారు. ఇప్పటికే కార్లను బుక్ చేసుకున్న వారికి ధరల పెంపు ఉండదని పేర్కొన్నారు. ఏ ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. కానీ కార్ల ధరలు సగటున 1.8 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది.