
బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేరకు బ్యాంకులకు కఠిన నిబంధనలు విధించింది. బ్యాంకుల డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ అయిన వెబ్ సైట్, యాప్లు తప్పుదారి ప్రకటించే డార్క్ ప్యాటర్న్లను నిషేధించింది. ఇక నుంచి కస్టమర్లను ఒత్తిడికి గురి చేసే ప్రకటనలను పొందుపర్చవద్దని స్పష్టం చేసింది.

కస్టమర్ల అనుమతి లేకుండా ఆర్ధిక ఉత్పత్తులను విక్రయించడం చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే చెక్ అవుట్ సమయంలో దాచిన ఛార్జీలు చూపించడం, పదే పదే ఫుష్ నోటిఫికేషన్స్తో ప్రొడక్ట్ కొనుగోలు చేసేలా కస్టమర్లపై ప్రెజర్ పెట్టడం వంటివి చేయవద్దని సూచించింది. ఒక ఆర్ధిక ఉత్పత్తి కొనుగోలు చేసే సమయంలో కస్టమర్కు తెలియకుండా మరో ఉత్పత్తి జోడించవద్దని సూచించింది.

బ్యాంకింగ్ యాప్స్లో కస్టమర్లను గందరగోళానికి గురి చేసేలా ఛార్జీలు ఉంటున్నాయి. ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేసేటప్పుడు ఒక ఛార్జీ ఉంటుండగా.. పేమెంట్ చేసేప్పుడు అదనపు ఛార్జీలను చూపిస్తు్న్నారు. ఇలాంటి ఛార్జీలను విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది

వేర్వేరు డిజైన్లు, టిక్ చేసి ఎంపికలు, గందరగోళానికి గురి చేసే ఆప్షన్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఇలాంటి విధానాలు బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్దమని ఆర్బీఐ హెచ్చరించింది. కస్టమర్లను బలవంతం పెట్టే ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.

లోకల్ సర్కిల్స్ అనే సంస్థ దేశంలోని 388 జిల్లాల్లో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బ్యాంకింగ్ డిజిటల్ యాప్స్లోని మోసాలు సాధారణమైనట్లు వెల్లడైంది. దీంతో జులైలోగా ఇలాంటి డార్న్ ప్యాటర్న్లను తొలగించాలని ఆర్బీఐ సూచించింది. కస్టమర్లకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై పారదర్శకత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.