
కొత్త నెల వస్తుందంటే చాలు.. దేశవ్యాప్తంగా అనేక మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ నిబంధనలు, క్రెడిట్ కార్డుల నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల రాబోతుంది. దీంతో అనేక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రజల నెలవారీ బడ్జెట్లు, పొదుపు పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఇతర అవసరమైన ఖర్చులపై నేరుగా ప్రభావం చూపవచ్చు.

ఆగస్టు 1, 2026 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో రైల్వేశాఖ మార్పులు చేయనుంది. ఈ కొత్త విధానం ప్రకారం.. రిజర్వేషన్ కౌంటర్లలో టోకెన్లు జారీ చేసే సమయం, తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి అనుగుణంగా ఉంటుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి ప్రయాణికులకు టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణికులు టోకెన్లు సేకరించి, టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వేర్వేరుగా కౌంటర్లకు వెళ్లాల్సి వచ్చేది.

ఇక ఆగస్టు 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గృహ, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కోసం కొత్త ధరలను ప్రకటించనున్నాయి. ధరలలో ఏ పెరుగుదల అయినా గృహ బడ్జెట్లపై ప్రభావం చూపవచ్చు. అయితే తగ్గింపు వినియోగదారులకు ఉపశమనం కలిగించవచ్చు. హార్ముజ్ జలసంధి మళ్లీ మూతపడిన క్రమంలో ఈ సారి ధరలు ఎలా ఉంటాయని చర్చనీయాంశంగా మారాయి.

బ్యాంకులు, బీమా కంపెనీలు ఆగస్ట్ 1వ తేదీ నుంచి సెంట్రల్ నో యువర్ కస్టమర్ 2.0 వ్యవస్థను ప్రవేశపెట్టనున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా వినియోగదారుడి అనుమతితో కేంద్ర రిజిస్ట్రీలో నిల్వ ఉన్న వినియోగదారుడి సమాచారాన్ని సంస్థలు పొందవచ్చు. ఇది భద్రతను మెరుగుపరచడానికి, మోసాలను నివారించడానికి సహాయపడుతుంది. కేవైసీ కోసం ఆధార్, పాన్ లాంటివి అందించాల్సిన పని ఉండదు.

ఇక బ్యాంకులు రివార్డ్ పాయింట్లు, ఫీజులు, ఇతర సేవలతో సహా క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను కూడా సవరించే అవకాశముంది. ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటుపై తీసుకునే ఏ నిర్ణయమైనా రుణ ఈఎంఐలు, FD రాబడులను కూడా ప్రభావితం చేయవచ్చు.