
బంగారం, వెండి ధరలు గత రెండేళ్ల కాలంలో రెట్టింపు స్థాయిలో పెరగ్గా.. రాగి కూడా అదే బాటలో నడుస్తోంది. బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో ఉండటంతో.. చాలామంది రాగిలో పెట్టుబడులు పెడుతున్నారు. ధరలు పెరగడానికి ఇదొక కారణంగా నిలుస్తోంది. దీంతో పాటు పారిశ్రామిక అవసరాల్లో రాగి వినియోగం విపరీతంగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచవ్యా్ప్తంగా డేటా సెంటర్లను డిమాండ్ పెరిగింది.

కంపెనీలన్నీ కొత్తగా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. డేటా సెంటర్ల నిర్మాణంలో రాగిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో కూడా రాగిని వాడటం ఎక్కువగా జరుగుతుంది. ఈ అంశాలతో ఈ రెడ్ మెటల్ మార్కెట్లో హాట్ కేకులా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా కాపర్ ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుని పెట్టుబడిదారులను ఆశ్చర్యపర్చాయి.

లండన్ మెటల్ ఎక్సేంజ్లో ఏకంగా టన్నుకు 14,533 డాలర్లకు చేరుకుని రాగి సరికొత్త రికార్డు నమోదు చేసింది. పారిశ్రామికంగా దీని డిమాండ్ పెరగడం, ఉత్పత్తి కూడా తక్కువగా ఉండటంతో రానున్న రోజుల్లో కాపర్ అత్యంత ఖరీదైన లోహంగా మారే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాగిలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

రాగిని ఉత్పత్తి చేసే కంపెనీల్లో భారతీయులు స్టాక్ మార్కెట్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. హిందూస్థాన్ కాపర్, హిందాల్కో వంటి స్టాక్ట్స్ కొనుగోలు చేయవచ్చు. అలాగే వేదాంతలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ ద్వారా రాగి ప్యూచర్లలో ట్రేడింగ్ చేసే అవకాశముంది. అయితే రిస్క్ మేనేజ్మెంట్ తెలియకుండా వీటిల్లోకి అడుగుపెట్టడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.

అయితే భారత్లో కాపర్ ఈటీఎఫ్లు అందుబాటులో లేవు. కానీ హెచ్డీఎఫ్సీ, మిరే అసెట్ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్ల ద్వారా పరోక్షంగా పెట్టుబడులు పెట్టవచ్చు. విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎల్ఆర్ఎస్ ద్వారా పెట్టవచ్చు. పవర్ గ్రిడ్లలో కూడా రాగిని ఉపయోగిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో మరింత డిమాండ్ ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు