
ఇండియాలో పోస్టాఫీస్ సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తరతరాలుగా ప్రజలు వీటి సేవలను ఉపయోగించుకుంటూ వస్తున్నారు. జనరేషన్ మారుతున్న కొద్ది పోస్టాఫీస్ సేవలు కూడా మారుతున్నాయి. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా తమ విధానాల్లో పోస్టల్ శాఖ మార్పులు చేసుకుంటూ వస్తోంది. దీంతో ఇప్పటికే పోస్టాఫీస్ సేవలపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ప్రైవేట్ కొరియర్ సంస్థలు ఎన్ని పుట్టుకొస్తున్నా.. పోస్టాఫీస్ సేవలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండటంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది.

అయితే ప్రజలకు ఇండియా పోస్ట్ మరో శుభవార్త అందించింది. మీరు తప్పుగా స్పీడ్ పోస్ట్ లేదా పార్సిల్, మనీ ఆర్డర్ లేదా ఇతర సేవలకు సంబంధించి ఏదైనా బుకింగ్ చేసుకున్నాక దానిని రద్దు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు పూర్తి రీఫండ్ అందుతుంది. గతంలో ఇలాంటి రీఫండ్ అవకాశం లేకపోవడంతో ప్రజలు తమ డబ్బులను నష్టపోతున్నారు. దీంతో పోస్టల్ శాఖ నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రజలకు పోస్టాఫీస్ సేవలను మరింత సౌకర్యవంతంగా అందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

పోస్టాఫీస్ యాప్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఏదైనా బుకింగ్ అయ్యాక మీరు ఏదైనా కారణాలతో క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు పోస్టేజ్ ఫీజును రీఫండ్ ఇచ్చేస్తారు. దీనికి సంబంధించి ఇండియా పోస్ట్ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లేదా పోస్టాఫీస్ కౌంటర్ ద్వారా బుకింగ్ రద్దు చేసుకుంటే రుసుంలను వాపసు ఇస్తారు. అయితే పోస్టాఫీస్ సిబ్బంది ఆ వస్తువును స్వీకరించడానికి ముందే బుకింగ్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది

మీరు రద్దు చేసుకోగానే ఆటోమేటిక్గా రీఫండ్ అందుతుంది. అంతర్జాతీయ పోస్టాఫీస్ సేవలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. అంతర్జాతీయ తపాలా వస్తువులను స్వీకరించేవారు, తపాలా రుసుము చెల్లించి డెలివరీ కార్యాలయం నుండి వస్తువులను తిరిగి పంపించుకోవచ్చు. అయితే, కొత్త అడ్రస్ అదే తపాలా కార్యాలయం డెలివరీ పరిధిలో ఉంటే ఎటువంటి రుసుము వసూలు చేయరు.

అంతర్జాతీయ పార్సిల్స్ పంపేవారు విదేశీ గమ్యస్థానాల నుండి వస్తువులను వెనక్కి పిలిపించుకోవడానికి లేదా తిరిగి పంపించుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ఈ కొత్త రూల్స్ ఇప్పటినుంచి అమల్లోకి వస్తాయని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది. దీని వల్ల పోస్టాఫీస్ సేవలు మరింత మెరుగుపడనున్నాయి.