
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూ్స్. దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో అగ్రగామిగా ఉన్న హెచ్డీఎఫ్సీ తమ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్లో పలు మార్పులు చేసింది. రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు వాడుతున్నవారికి ఝలక్ ఇచ్చింది. ఈ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఎయిర్పోర్టులో ఉచిత లాంజ్ యాక్సెస్కు కఠిన నిబంధనలు విధించింది.

ఇక నుంచి ఉచిత లాంజ్ యాక్సెస్ సౌకర్యం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో ఖచ్చితంగా రూ.60 వేలు క్రెడిట్ కార్డు నుంచి ఖర్చు చేసి ఉండాలి. అప్పుడే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. రూ.60 వేలు ఖర్చు చేయకపోతే ఉచిత యాక్సెస్ పొందలేరు. విమాన ప్రయాణాలు చేసేవారికి ఇది బ్యాడ్న్యూస్గా చెప్పవచ్చు.

లాంజ్ వినియోగం పెరుగుతున్న క్రమంలో ప్రీమియం కార్డ్ ప్రయోజనాలను కఠినతరం చేసేందుకు హెచ్డీఎఫ్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎలాంటి ఖర్చు చేయకపోయినా దేశీయ ఎయిర్పోర్టుల్లో ఉచితంగా లాంజ్ సౌకర్యం పొందవచ్చు. అయితే జులై నుంచి రూల్స్ పూర్తిగా మారుతున్నాయి. లాంజ్ యాక్సెస్కు సంబంధించి కొన్ని షరతులు విధించారు.

జులై నుంచి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతీ క్యాలెండర్ త్రైమాసికంలో గరిష్టంగా మూడుసార్లు ఉచిత లాంజ్ యాక్సెస్ ఉంటుంది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య లాంజ్ యాక్సెస్ కోసం ఏప్రిల్, జూన్ 2026 మధ్య రూ.60 వేలు ఖర్చు చేసి ఉండాలి. ముందు త్రైమాసికంలో చేసిన ఖర్చు ఆధారంగా ప్రతీ త్రైమాసికంలో లాంజ్ అర్హత అనేది రీసెట్ చేస్తారు. కార్డును నేరుగా స్వైప్ చేయడం ద్వారా లాంజ్ యాక్సెస్ పొందవచ్చు.

ఇటీవల బ్యాంకులన్నీ క్రెడిట్ కార్డులపై ఉచిత లాంజ్ ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. జీతం తీసుకునే ఉద్యోగులు ప్రీమియం ట్రావెల్ కార్డు ఎక్కువగా వినిగిస్తున్నారు. దీంతో లాంజ్ వినియోగం అనేది భారీగా పెరిగిపోయింది. కస్టమర్ లాంజ్ యాక్సెస్ ఉపయోగించుకున్న తర్వాత ఆపరేటర్కు బ్యాంకుల చెల్లిస్తాయి. దీంతో బ్యాంకులపై భారం పెరుగుతోంది. దీంతో పరిమితులు విధిస్తూ వస్తున్నాయి.