
Pension: భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితి ప్రకారం, మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసినా, ఒక వ్యక్తి గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే పని చేయగలరు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక వ్యక్తి గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే పని చేసి ఆదాయం సంపాదించగలరు. 60 సంవత్సరాలు దాటిన వారు ప్రభుత్వ ఉద్యోగులైతే, వారికి పింఛను అందిస్తారు.

ఒకవేళ వీరే ప్రైవేట్ రంగ ఉద్యోగులైతే 60 ఏళ్ల తర్వాత వారి నెలసరి జీతం ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ పరిస్థితిలో పదవీ విరమణ తర్వాత ప్రజలకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు అనేక రకాల పింఛను పథకాలు అమలులో ఉన్నాయి. అటువంటి పథకాలలో ఒకటి అటల్ పింఛను యోజన (APY). ఈ పథకంలో ప్రతిరోజూ రూ.7 పెట్టుబడి పెట్టి, నెలకు రూ.5,000 పింఛను ఎలా పొందాలో చూద్దాం..

అటల్ పెన్షన్ యోజన అనేది పౌరులు తమ పదవీ విరమణ జీవితాన్ని సురక్షితంగా గడపడానికి కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక అద్భుతమైన పథకం. ఈ పథకం ప్రజలలో చాలా ప్రజాదరణ పొందింది. చాలా మంది ప్రజలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. దీనికి కారణం ఈ పథకంలో ప్రతిరోజూ రూ.7 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు నెలకు రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు.

ఈ పథకం ప్రత్యేకతలు ఏమిటి?: ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ వృద్ధాప్యంలో రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు పింఛను పొందవచ్చు. ఈ పథకంలో ఒక వ్యక్తి తన పదవీ విరమణ వయస్సును పరిగణనలోకి తీసుకుని ముందుగానే పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా పెట్టుబడి పెడితే ఆ వ్యక్తికి 60 ఏళ్ల వయస్సు తర్వాత పింఛను మొత్తం లభిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎంత ముందుగా పెట్టుబడి పెడితే, పెట్టుబడిగా అంత తక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు.

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడనుకుందాం. ఈ పథకంలో అతను నెలకు రూ. 210 చెల్లించాలి. అంటే అతను రోజుకు రూ. 7 పెట్టుబడి పెట్టాలి. ఇలా నామమాత్రపు ప్రీమియంతో 60 ఏళ్ల వయసు తర్వాత జీవితాంతం పెన్షన్ అందుకునే అవకాశాన్ని ఈ స్కీమ్ కల్పిస్తుంది. అయితే మీరు వయస్సును బట్టి నెలనెల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఈ నెల వారీ డిపాజిట్ రూ.210 నుంచి మొదలవుతుంది. మీ వయస్సు పెరిగిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు నెలవారీ పెన్షన్ రూ.1000 నుంచి రూ.5000 వరకు ఎంచుకోవచ్చు.