
Hyderabad: హైదరాబాద్ టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక చిప్ డెవలప్మెంట్కు హైదరాబాద్ వేదిక కానున్నది. అమెరికాకు చెందిన సెరిమోర్ఫిక్ సంస్థ.. భాగ్యనగరంలో తమ తొలి డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసింది. కంప్యూటింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొత్త ఆర్కిటెక్చర్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.

35 వేలకుపైగా చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ సెంటర్లో ఐఐటీ హైదరాబాద్ సహకారంతో చిప్ డెవలప్మెంట్కు కంపెనీ కృషి చేయనుంది. ఓ సూపర్కంప్యూటింగ్ చిప్ తయారీ దిశగా సెరిమోర్ఫిక్ వెళ్తున్నట్టు సంస్థ యాజమాన్యం వెల్లడించింది.

టీఎస్ఎంసీ 5ఎన్ఎం నాడ్లో అత్యంత విశ్వసనీయత, శక్తి సామర్థ్యంతో దీన్ని రూపొందించనున్నామన్న కంపెనీ.. 2024 వరకు ఈ చిప్ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపింది. మరో గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా మారబోతున్న భారత్కు హైదరాబాదే కేంద్రం కానుందనే భారీ అంచనాలకు మరింత బలం చేకూరింది.

గతకొద్ది నెలలుగా దేశంలో వివిధ రంగాలను చిప్ల కొరత వేధిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆటో, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలను సెమీకండక్టర్ల లేమి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఈ దీంతో సెరిమోర్ఫిక్ హైదరాబాద్ సెంటర్ ద్వారా చిప్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.