కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వివిధ రంగాలలో ఆర్థికంగా ఎదగడం నుంచి పెన్షన్ తీసుకునే వరకు ఎన్నో స్కీమ్లను ప్రవేశపెడుతోంది మోడీ సర్కార్. ఇందులో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలలో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) స్కీమ్ ఒకటి.
గత ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన కింద మొత్తం చందాదారుల సంఖ్య 1.19 కోట్లని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) ఏప్రిల్ 6న విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఇందులో చేరితే నెలకు రూ.5వేలు పొందవచ్చు. కనీసం రూ.1000 పింఛను వస్తుంది. ఎవరైనా ఇందులో చేరాలనుకుంటే వెంటనే చేరిపోవడం ఉత్తమం. 18 - 40 సంవత్సరాల వయసు కలిగినవారు ఈ పథకానికి అర్హులు. 40 సంవత్సరాలు దాటితే అవకాశం ఉండదు. ఇందులో చేరాలనుకునేవారు నెలనెలా కొంత మొత్తం నగదును చెల్లించాల్సి ఉంటుంది. వయసు ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తారు.
నెల నెలా మనం చెల్లించే నగదు పింఛను రూపంలోకి మారుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు ఏ వయసులోనైనా అటల్ పెన్షన్ యోజనలో చేరితే 60 సంవత్సరాలు దాటిన తర్వాత పింఛను పొందవచ్చు. నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ అందుకోవచ్చు. అయితే ముందు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంత పెన్షన్ కావాలి అనేదానిపై ఆధారపడి ఉంటుంది.
మనం చెల్లించిన నగదును బట్టి పెన్షన్ అందుతుంది. 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మీరు రూ.1000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.42 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెలకు రూ.3000 పెన్షన్ కావాలంటే రూ.126, అలాగే రూ.5000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.210 చెల్లించాల్సి ఉంటుంది. అదే 40 ఏళ్లలో ఈ స్కీమ్లో చేరినట్లయితే నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.291 చెల్లించాల్సి ఉంటుంది.
అదే రూ.2000 పెన్షన్ కోసం రూ.582, రూ.5000 పెన్షన్ కోసం రూ.1454 చెల్లించాల్సి ఉంటుంది. ఇక నామినీకి చివరలో ఒకేసారి రూ.8.5 లక్షల వరకు అందుతాయి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే సమీపంలోని పోస్టాఫీసుకు వెళితే వివరాలు తెలుసుకోవచ్చు.