
నేటి కాలంలో మంచి జీతం ఒక్కటే సరిపోదు. వచ్చిన డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యంగా మారింది. అద్దె, EMIలు, కరెంట్ బిల్లులు, పిల్లల ఫీజులు, రోజువారీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో చాలామందికి నెలాఖరుకు పొదుపు చేయడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక నిపుణులు సూచిస్తున్న 50-30-20 రూల్ ఉద్యోగస్తులకు సులభమైన బడ్జెట్ ఫార్ములాగా మారుతోంది. ఈ నియమం ప్రకారం పన్నులు పోయిన తర్వాత చేతికి వచ్చే జీతాన్ని మూడు భాగాలుగా విభజించాలి.

అందులో 50 శాతం నిత్యావసర ఖర్చులకు, 30 శాతం వ్యక్తిగత అవసరాలు, జీవనశైలి ఖర్చులకు, మిగిలిన 20 శాతం పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. అద్దె, కిరాణా, విద్యుత్ బిల్లులు, EMIలు, బీమా ప్రీమియంలు వంటి ఖర్చులు మొదటి 50 శాతంలో ఉండాలి. బయట భోజనం, ప్రయాణాలు, షాపింగ్, వినోదం వంటి ఖర్చులు 30 శాతం విభాగంలోకి వస్తాయి. పనిచేసే ఉద్యోగస్తులలో అద్దె పెద్ద భారం అవుతోంది.

ఆర్థిక నిపుణుల ప్రకారం, అద్దె మొత్తం జీతంలో 25 నుంచి 30 శాతం మించకూడదు. ఉదాహరణకు నెలకు రూ.1 లక్ష ఆదాయం ఉంటే, రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య అద్దె ఉండటం సరైనదిగా భావిస్తారు. దీంతో మిగిలిన అవసరాలు, పెట్టుబడుల కోసం సరిపడా డబ్బు అందుబాటులో ఉంటుంది.

అలాగే EMIలు కూడా ఆదాయంలో 30 నుంచి 40 శాతం మించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రుణభారం ఉన్నప్పుడు ఆకస్మిక వైద్య ఖర్చులు లేదా ఉద్యోగ సమస్యలు ఎదురైతే ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక సంపద సృష్టిలో SIPలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి నెలా క్రమంగా పెట్టుబడి పెట్టడం ద్వారా చక్రవడ్డీ ప్రయోజనం లభించి, పదవీ విరమణ సమయానికి భారీ నిధిని నిర్మించుకోవచ్చు. అందుకే 20 శాతం పొదుపులో ఎక్కువ భాగాన్ని SIPలు, మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడుల వైపు మళ్లించాలని సూచిస్తున్నారు.

ఇక అత్యవసర నిధి, ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అనుకోని పరిస్థితుల్లో అది రక్షణగా నిలుస్తుంది. జీతం పెరిగిన కొద్దీ ఖర్చులు పెంచడం కాకుండా, పొదుపు, పెట్టుబడులను కూడా పెంచితే భవిష్యత్తులో ఆర్థిక భద్రత మరింత బలపడుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.