
తక్కువ నీరు త్రాగడం, తగినంత ఫైబర్లేని ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. దీంతో క్రమంగా ప్రేగు కదలికలు మందగించి మలబద్దకానికి దారితీస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారిలో పైల్స్ అభివృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి.

కాబట్టి మలబద్ధకాన్ని అస్సలు తేలికగా తీసుకోకూడదు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. కొన్ని సింపుల్ ఆయుర్వేద చిట్కాలతో మలబద్ధకం నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చు.

త్రిఫల ఆయుర్వేదంతో మలబద్ధకం సులువుగా దూరం అవుతుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయలు.. ఈ మూడు పండ్లను ఎండబెట్టి పొడి చేసి త్రిఫలా తయారు చేస్తారు. ఈ హెర్బల్ పదార్ధం పొట్టను శుభ్రపరచడంలో బలేగా పనిచేస్తుంది. త్రిఫల నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఉదయాన్నే పొట్ట క్లియర్ అవుతుంది. ఈ పానీయం శరీరంలోని అన్ని కాలుష్య కారకాలను బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. త్రిఫల నీరు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

త్రిఫల నీరు పేగు మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం నుంచి ఉపశమనానికి కూడా ఇది సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడమేకాకుండా, జీవక్రియ రేటును పెంచడంలో కూడా త్రిఫల సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలను నివారిస్తుంది. దీంతో బరువును కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి త్రిఫల నీటిని సేవించవచ్చు.

త్రిఫల చూర్ణం మార్కెట్లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఓ చెంచా త్రిఫల పొడిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో తాగాలి. రుచి కోసం అందులో 1 స్పూన్ తేనె కూడా కలుపుకోవచ్చు.