
శీతా కాలంలో ఆరోగ్య పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం లోపల కనిపించకపోయినా.. చర్మం, జుట్టు సమస్యలు మాత్రం కనిపస్తాయి. చర్మం పగిలి, దురదగా చిరాకుని కలిగిస్తుంది. అదే విధంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. శీతా కాలంలో వేధించే మరో సమస్య ఏంటంటే.. మడమలు పగిలిపోవడం.

వీటికి సకాలంలో చికిత్స చేయకపోతే.. ఈ పగుళ్లు ఎక్కువై రక్తం కారే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్య కేవలం చలి కాలంలో మాత్రమే వస్తుంది. ఏడాది పడవునా వచ్చిందంటే.. వారిలో విటమిన్ ఏ, బి, సి లోపం ఉందని తెలుసుకోవచ్చు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

పాదాల పగుళ్లు కేవలం చల్లని వాతావరణం వల్ల మాత్రమే కాదు.. కొన్ని వ్యాధుల కారణంగా కూడా వస్తాయి. ఆర్థరైటిస్, థైరాయిడ్, సొరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా పాదాలు పగులుతాయి. ఆ సమస్యలను కూడా గుర్తించి, తగిన చికిత్స త్వరగా తీసుకోవాలి.

పగిలిన మడమలతో ఇబ్బంది పడుతూ ఉంటే రాత్రి పూట కొట్టరి నూనెతో మసాజ్ చేయండి. సాక్సులు వేసుకుని నిద్ర పోతే మంచి ఫలితం ఉంటుంది. ఇవి పగుళ్లను తగ్గించడంలో ఎఫెక్టీవ్గా పని చేస్తుంది.

పాదాల్లో పగుల సమస్యను తగ్గించుకోవాలంటే.. ఎప్పుడూ తేమగా ఉంచాలి. నిపుణుల ప్రకారం ప్రతి రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మడమల పగుళ్లను తగ్గించడంలో కలబంద జెల్ కూడా బాగా పని చేస్తుంది. పగుళ్లు ఉన్నచోట తరచూ అలోవెరా జెల్ రాయండి.