
ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లా. సంప్రదాయాలకు కట్టుబాట్లకు కేరాఫ్ అడ్రస్. ఆదివాసీ గూడాల్లో పటేల్ మాటే శాసనం. పటేల్ ఎంత చెపితే అంత.. కానీ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పాండుగూడలో మాత్రం.. ఆ ఊరు ఆ పటేల్నే కాదనుకుంది. పటేల్తో తాడోపేడో తేల్చేసుకుంది.

పటేల్ వ్యవహార శైలి కారణంగానే తాము ఆర్థికంగా కుంగిపోతున్నామని.. తమ కుటుంబాలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయంటోంది. పటేల్ బంధువు చేసిన మంత్రాలే కారణమంటూ ఎదురు తిరిగింది ఆ గూడెం. పిల్లాజెల్లా అంతా కలిసి కట్టుబట్టలతో కన్నతల్లిలాంటి ఊరును వదిలేసి వలసెల్లిపోయింది.

ఇది జరిగి మూడేళ్లు అవుతున్నా తాజాగా ఈ సమస్య మళ్లీ తెర పైకొచ్చింది. మూడేళ్ల క్రితం అసలేం జరిగింది. ఇప్పుడు కొత్త గూడ పరిస్థితి ఏంటి. ఆనాటి చేదు జ్ఞాపకాలను శిథిలమై శ్మశానాన్ని తలపిస్తూ మొండిగోడలతో ఉన్న పాతగూడ దాటి రెండు కిలో మీటర్లు వెళితే వలసొచ్చి కొత్తగూడాన్ని ఏర్పాటు చేసుకున్న వలస గ్రామం కోసుపటేల్ కనిపిస్తుంది.

కోసు పటేల్ గూడలో పచ్చదనం.. పశుసంపద.. దాతల సాయంతో నిర్మాణమైన కొత్త బడి.. సొంతగా నిర్మించుకున్న మట్టి రోడ్లు కనిపిస్తాయి. పాండుగూడ 30 గడపలతో 300 ఏళ్ల నుండి ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చింది.

తొమ్మిదేళ్ల క్రితం తమ తండ్రి కోసుపటేల్ మరణంతో తమ పెద్ద అన్న కొమ్రం భీం రావును పాండుగూడకు పటేల్గా ఎన్నుకున్నామన్నారు కొమ్రం రావుజీ. పటేల్గా కొమ్రం భీంరావు పాలనలో నాలుగేళ్లు ప్రశాంతంగానే సాగింది పాండుగూడ. కానీ నాలుగేళ్ల తర్వాత పాండుగూడలో హఠాత్తుగా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి.

ఏడాది కాలంలోనే ఆరుగురు మృతి చెందడంతో ఆ ఊరులో ఏదో జరుగుతుందనే భయం పట్టుకుంది. మంచి నీళ్ల బావి వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లుకనిపించడంతో గ్రామస్తులు భయం మరింత పెరిగింది. దీంతో 28 కుటుంబాలతో ఊరు ఊరంతా పటేల్ కొమ్రం భీంరావు పై తిరగబడింది.

ఫలితంగా 28 కుటుంబాలు కన్నతల్లి లాంటి పాండుగూడను వదిలేసి కొత్త భవిష్యత్ కోసం కొత్త బాటపట్టింది. అలా వలస వెళ్లిపోయిన 28 కుటుంబాలు ప్రస్తుతం 45 కుటుంబాలతో కొత్తగా కోసుపటేల్ గూడాను ఏర్పాటు చేసుకుంది. దీంతో 3 వందల ఏళ్ల చరిత్ర ఉన్న పాత గూడెం మొండిగోడలతో పాడుబడిపోయింది.

తాజాగా కొత్త గూడాన్ని ఏర్పాటుచేసుకొని కోసుపటేల్ గూడెంగా పేరు పెట్టుకున్నాయి. ఈ గూడెంలో 45 కుటుంబాలు.. 200 మంది ఓటర్లు ఉండగా.. విద్యార్థులు 22 మంది ఉన్నారు. పాండుగూడ నుండి వలసొచ్చిన 28 కుటుంబాలు.. లక్ష రూపాయల చొప్పున జమ చేసి ఆరెకరాల వ్యసాయ భూమిని రూ.25 లక్షలకు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.