
వస్తు, సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్ సమావేశం) 50వ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు వస్తువులపై పన్నును తగ్గించింది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వండని/వేయించని ఎక్స్ట్రూడెడ్ స్నాక్ ప్యాలెట్లపై పన్ను స్లాబ్ను 18% నుంచి 5%కి తగ్గించారు. కేన్సర్ ఔషధానికి జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ప్రకటించారు.

అలాగే చేపనూనెతో తయారు చేసే పేస్ట్, కృత్రిమ ఆభరణాల తయారీలో ఉపయోగించే జరీ దారంపై కూడా జీఎస్టీ శ్లాబ్ను 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అయితే ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలపై పన్ను శ్లాబ్ను 28 శాతానికి పెంచినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రైవేట్ సంస్థల ఉపగ్రహ ప్రయోగ సేవలకు కూడా జీఎస్టీ పన్ను మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి తెలియజేశారు. అంతరిక్ష పరిశోధన రంగంలో కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

సినిమా థియేటర్లలో విక్రయించే ఆహారం, పానీయాలపై 18% GST ఉండదు. 5% జీఎస్టీ మాత్రమే విధిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. జీఎస్టీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టానికి (పీఎంఎల్ఏ) జీఎస్టీ నిబంధనలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

జీఎస్టీఎన్ సమాచారాన్ని పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకురావాలన్న నోటిఫికేషన్ దర్యాప్తు సంస్థలను బలోపేతం చేసే చర్య మాత్రమే. పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం ఇంతకుముందు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండేదని ఆయన అన్నారు.