
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మోహిత్ గుప్తా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఎముకల ఆరోగ్యంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను చేర్చుకోవడం వల్ల ఎముకలు, కీళ్లు బలపడటమే కాకుండా.. భవిష్యత్తులో వచ్చే శస్త్రచికిత్సలప్రమాదాన్ని కూడా అధిగమించవచ్చని ఆయన స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో కూడా ఎముకల నొప్పులు లేని సంతోషకరమైన జీవితం కోసం డాక్టర్ గుప్తా కీలక విషయాలు వెల్లడించారు.

ఆకుపచ్చని ఆకుకూరలు - సిట్రస్ పండ్లు: పాలకూర, కేల్, బ్రోకలీ వంటి కూరగాయలు ఎముకలకు మేలు చేసే అమృత గుణాలు కలిగినవి. వీటిలో కాల్షియం, విటమిన్ K పుష్కలంగా ఉండి ఎముకల సాంద్రతను పెంచుతాయి. వీటితో పాటు నారింజ, నిమ్మ, బత్తాయి, ఉసిరి వంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల వాటిలోని విటమిన్ C శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ కొల్లాజెన్ ఎముకలు, కీళ్లను సడలిపోకుండా, నమ్యతగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒమేగా-3 కొవ్వు చేపలు- పాల ఉత్పత్తులు: సాల్మన్, సార్డిన్లు, మాకెరెల్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ D మెండుగా ఉంటాయి. ఇవి కీళ్లలో వచ్చే వాపులను తగ్గించి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇక పాలు, పెరుగు, పనీర్ వంటి ఉత్పత్తులు కాల్షియానికి, ప్రోటీన్లకు ప్రధాన నిలయాలు. ప్రతిరోజూ సరిపడా పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఎముకలు గుల్లబారకుండా బలపడతాయి.

డ్రై ఫ్రూట్స్ - గింజలు: బాదం, వాల్నట్లతో పాటు చియా గింజలు, అవిసె గింజలలో మెగ్నీషియం, భాస్వరం, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం శరీరంలో కాల్షియం సరిగ్గా శోషించబడటానికి సహాయపడుతుంది. ఇవి కొత్త ఎముక కణాల నిర్మాణానికి తోడ్పడటమే కాకుండా కీళ్లను గుజ్జు దెబ్బతినకుండా కాపాడుతాయి.

మనం తినే ఆహారంతో పాటు ప్రతిరోజూ ఉదయం కాసేపు ఎండలో నిలబడటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ D లభిస్తుంది. అలాగే క్రమం తప్పకుండా వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ఎముకలు మరింత పటిష్టంగా మారతాయి. వృద్ధాప్యంలో కూడా ఎముకలు ఇనుములా బలంగా ఉండి, కీళ్ల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదంటే.. నేటి నుంచే ఈ ఆహారాలను మీ రోజువారీ డైట్లో భాగం చేసుకోండి.