
సిట్రస్ పండ్లు: నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చేపలలోని ప్రోటీన్ను శరీరం సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల పేగుల్లో అసౌకర్యం, తీవ్రమైన కడుపు నొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

పాలు - పాల ఉత్పత్తులు: చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు చేపలు తిన్న వెంటనే పాలు తాగడం లేదా పెరుగు తినడం. చేపలు, పాల ఉత్పత్తుల స్వభావం వేరువేరుగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, కడుపు నొప్పికి దారితీయడమే కాకుండా, కొంతమందిలో చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతుంటారు.

కూల్ డ్రింక్స్: చేపలు తిన్న తర్వాత సోడా లేదా కూల్ డ్రింక్స్ వంటి కార్బోనేటేడ్ పానీయాలు తాగడం అస్సలు మంచిది కాదు. ఇవి సహజ సిద్ధమైన జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయి. ఫలితంగా కడుపులో అసౌకర్యం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అధిక ప్రోటీన్ కలిగిన పప్పుధాన్యాలు: చేపల్లో ఇప్పటికే ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు పప్పులు, బీన్స్ లేదా పుట్టగొడుగులు వంటి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలను కలిపి తీసుకున్నప్పుడు, జీర్ణవ్యవస్థపై భారం పెరుగుతుంది. ఇది జీర్ణ రుగ్మతలకు దారితీస్తుంది. కాబట్టి వీటిని విడివిడిగా తీసుకోవడమే ఉత్తమం.

పిండి పదార్ధాలు: పాస్తా, బంగాళాదుంపలు వంటి పిండి పదార్థాలను చేపలతో కలిపి అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది మీకు తెలియకుండానే మీలో నీరసాన్ని, బద్ధకాన్ని కలిగిస్తుంది. అందుకే చేపలతో పాటు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.