Snake: పాములు పగబడతాయా? చంపేవరకు వదలవా? వాటికి పగా, ప్రతీకారాలు ఉంటాయా?

|

Mar 20, 2022 | 6:45 PM

అసలు పాముల స్వభావం ఎలా ఉంటుంది. మనుషులకు ఉన్నట్టే పాములకు పగా, ప్రతీకారాలు ఉంటాయా? భక్తుల విశ్వాసమే నిజమా? లేదంటే సైన్స్ చెప్తున్నదే అసలు వాస్తవమా?

Snake: పాములు పగబడతాయా? చంపేవరకు వదలవా? వాటికి పగా, ప్రతీకారాలు ఉంటాయా?
Snake
Follow us on

Andhra Pradesh: చిత్తూరు జిల్లా( chittoor district)లో ఓ కుటుంబాన్ని.. పాము కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంట్లో ఉండేది నలుగురు. కానీ 45 రోజుల్లోనే నలుగురిపైనా స్నేక్ అటాక్ జరిగింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబం పాము పేరు చెప్తేనే గజగజా వణికిపోతోంది. ఇది పగా.. యాదృశ్చికమా? ఎవరికీ అంతుబట్టల్లేదు. వివరాల్లోకి వెళ్తే… చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని డోర్నకంబాల పంచాయతీకి చెందిన మల్లయ్యపల్లిలో వెంకటయ్య కుటుంబానికి నివశిస్తోంది. వెంకటయ్యతో పాటు అతని భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్‌, తండ్రి గుడిసెలో నివాసం ఉంటారు. పాము ఒకసారి కరిస్తే యాక్సిడెట్‌ అనుకోవాలి.. రెండు సార్లు కాటేస్తే.. మూడోసారి కూడా జరిగితే ఏమనాలి. అదీ కుటుంబంలో ఉన్న నలుగురినీ వరుసపెట్టి వేటాడితే.. దానికి ఏ పేరు పెట్టాలి. కానీ కేవలం 45 రోజుల్లోనే ఈ కుటుంబం 7సార్లు కాటుకు గురైంది. నిత్యం ఎవరో ఒకరు ఆస్పత్రిలోనే.. వారంలో ఎవరో ఒకరు నురగలు కక్కుతూ పడిపోవడమే.. ప్రాణాపాయంతో విలవిలలాడిపోవడమే.. రెండు నెలలుగా.. ఈ కుటుంబం పడుతున్న క్షోభ అంతా ఇంతా కాదు. రాత్రి పూట ఇంట్లో ఉండాలంటేనే భయం. ఏ క్షణంలో వస్తుందో.. ఎవరిని కాటేస్తుందో అర్ధం కాక.. బిక్కు బిక్కు మంటూ.. వేదనను పంటి బిగువున భరిస్తూ కాలం వెల్లదీస్తోందీ కుటుంబం. ఫిబ్రవరి 5న మొదటి సారిగా.. వెంకటయ్య కుమారుడు జగదీష్‌ని కాటేసింది పాము. అదే నెల 18న వెంకటయ్యను కాటేసింది. ఆ తర్వాత వెంకటయ్య భార్య, వెంకటయ్య తండ్రి.. ఇలా ఒకరి తర్వాత ఒకరిని వేటాడుతోంది. వెంకటయ్య కుమారుడు జగదీష్‌ని రెండో సారి కూడా కాటేసింది. స్నానం చేస్తున్న సమయంలో జగదీష్‌ను పాము కాటేసింది. కాసేపటికే.. నోటి నుంచి నురగలు రావడంతో పాటు వాంతులు, ఒళ్లంతా దద్దుళ్లు వచ్చాయని చెబుతున్నాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లినట్టు చెప్తున్నారు.

5 సంవత్సరాలుగా ఇదే గుడిసెలో ఏ సమస్యా లేదు. పురుగులు, పాములు దరిదాపుల్లో కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో అర్ధం కాని అయోమయం. పాము కాటేసిన ప్రతిసారి రుయా ఆస్పత్రి వీళ్ల పాలిట వరంగా నిలుస్తోంది. సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు నిలబెడుతున్నారు డాక్టర్లు. అందర్నీ కరిచింది ఒకే పామనీ.. తమ కుటుంబంపై ఆ సర్పం పగ బట్టిందంటూ ఆ ఫ్యామిలీ వణికిపోతోంది.  పక్కనే ఉన్న కొండ ప్రాంతం నుంచి పాము వస్తోందని లోకల్ టాక్. వెంకటయ్య ఇంటి పరిసరాల్లో నాగుపాము తిరగడం చాలాసార్లు చూశామంటున్నారు. కేవలం రాత్రి సమయాల్లోనే వచ్చి పాము కాటేస్తోందంటున్నారు స్థానికులు. పాము అటాక్ అయితే చేస్తోంది. కానీ ఆ కుటుంబాన్ని పాము ఎందుకు వేటాడుతోందో.. ఇన్ని సార్లు ఎందుకు కాటేసిందో.. ఎవరికీ అర్ధం కాని మిస్టరీ. అన్ని సార్లు వాళ్లింటికి వచ్చింది ఒకే పామా.. లేదంటే వేర్వేరు పాములా అనేది విషయంపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.

పామును దేవతలా కొలిచే భక్తులు.. పగలు, ప్రతీకారాలు ఉంటాయని నమ్ముతారు. వాటికి ఆపద తలపెడితే కచ్చితంగా వేటాడతాయంటారు. ఒకసారి పగపడితే.. ఆ వ్యక్తి చనిపోయే వరకూ వేటాడుతూనే ఉంటాయని కొందరి వాదన. పాము తలపై అత్యంత విలువైన మణులు ఉంటాయని నమ్మకం కూడా. హేతువాదులది మాత్రం మరో కోణం. అదంతా మూఢ నమ్మకం అని, అసలు పగబట్టేంత మైండ్ సెట్ పాములకు ఉండదనేది వారివాదన. పాములకు ఎలాంటి అతేంద్రియ శక్తులు, జ్ఞాపక శక్తి లేదన్నది సైన్స్ చెప్తోన్న నిజం. పాములకు జ్ఞాపక శక్తి తక్కువ. పుట్టలో నుంచి బయటకు వచ్చిన పాము ఒక్కోసారి తన పుట్ట ఎక్కడో మరిచిపోతాయంటున్నారు వెటర్నరీ డాక్టర్లు.

తమ ఆత్మరక్షణ కోసం అంటే ఎవరో తమకు హాని తలపెడుతున్నారనే తలంపుతో బుసకొడతాయి. లేదా కాటు వేస్తాయి తప్ప… పాములు పగబట్టే దానికి అవకాశమే లేదంటున్నారు నిపుణులు.  పాములు పగబడతాయనేది.. మూఢనమ్మకం మాత్రమే. అవి పగబట్టే అవకాశమే లేదు. అనేక పరిశోధనలు కూడా ఇదే చెప్పాయి. పాములన్నీ కాటేస్తాయి. కానీ కాటేసినవన్నీ విషపూరితం కాదు. కేవలం కొన్ని సర్పాలు మాత్రమే విషం చిమ్ముతాయి. ఒక్కొక్కసారి విషసర్పాలు కాటు వేసినా విషం ఎక్కదు. ఎందుకంటే అది ఆహారం తీసుకున్న నాలుగైదు గంటల వరకు విషం విడుదల అవదు. ఆ సమయంలో మనిషిని కాటువేస్తే విషం ఎక్కదు.

కాబట్టి పాముల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నారు జంతు ప్రేమికులు. ఎక్కడ పాములు కనిపించినా.. చంపొద్దని వేడుకుంటున్నారు. పాము ఏదైనా అపాయంలో ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స అందించాలనేది స్నేక్ లవర్స్ రిక్వెస్ట్.

Also Read: Viral: ఒకే వ్యక్తికి 500 పాముకాట్లు.. జనసముహంలోనూ అతడిపైనే ఎటాక్