Ramappa Temple: రామప్పకు యునెస్కో గుర్తింపు పుణ్యమాని రైతుల పంట ఒక్కసారిగా పండింది

|

Aug 05, 2021 | 8:22 PM

రామప్పకు యునెస్కో గుర్తింపుతో ఆ గుడి దశ మరాడం మాటేమో కానీ.. అక్కడి రైతులు - రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం పంట పండింది..

Ramappa Temple: రామప్పకు యునెస్కో గుర్తింపు పుణ్యమాని రైతుల పంట ఒక్కసారిగా పండింది
Ramappa Temple
Follow us on

Ramappa Temple – Real Estate: రామప్పకు యునెస్కో గుర్తింపుతో ఆ గుడి దశ మరాడం మాటేమో కానీ.. అక్కడి రైతులు – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం పంట పండింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను రామప్పపై పడడంతో అక్కడి భూముల ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. వరంగల్- హైదరాబాద్‌కు చెందిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రామప్పలో వాలిపోవడంతో నిన్నటి వరకు పది లక్షలు పలకని భూముల ధరలు ఇప్పుడు కోటి దాటింది.

కట్ చేస్తే, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంపై ఇప్పుడు విశ్వ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఫ్యూచర్‌లో దేశంలోనే ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా రామప్ప దేవాలయం రూపుదిద్దుకోబోతుంది. ప్రభుత్వం కూడా ఇందుకోసం అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ అభివృద్ధి ప్రణాళికలు, ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తే ఎలాంటి వారికైనా ఇక్కడే తనివితీరా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది.

అయితే, రామప్ప ఫ్యూచర్ కొందరి జీవితాలను మార్చేసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు ఎకరానికి 15 నుండి 18 లక్షల రూపాయలే అత్యధిక ధర. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎకరాకు కోటి రూపాయలకు పైనే పలుకుతోంది. భూ కైలాస్ సినిమా గుర్తొస్తోంది.

భవిష్యత్తులో రామప్ప గొప్ప పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ వాలిపోయారు. వ్యవసాయ భూములు కొనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆకస్మిక పరిణామంతో రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములున్న రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అటు, కాకతీయులు ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయంతో పాటు సమీపంలోనే చెరువును కూడా నిర్మించారు. దీని కింద సుమారు 5,100 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మరో 5వేల ఎకరాల్లో అనధికారికంగా పంటలకు నీరందిస్తున్నారు. రామప్ప చుట్టూ ఉన్న పదికిపైగా గ్రామాలకు రామప్ప చెరువే జీవనాధారం.

ఆయా పల్లెల్లో మరో వెయ్యి ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందుతోంది. అయినప్పటికీ ఇక్కడి వ్యవసాయ భూములకు పెద్దగా ధరలు ఉండేవి కాదు. కానీ, 2019 లో ప్రపంచ వారసత్వ స్థలిగా రామప్పను యునెస్కో నామినేట్‌ చేయడంతో అప్పటి నుండే ఇక్కడ రియల్‌ బూమ్‌ మొదలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా బినామీ పేర్లతో ఇక్కడ భూములు కొన్నారు.

2020 వరకు ఎకరాకు గరిష్ఠంగా 18 లక్షల రూపాయలు దాకా పలికిన ఇక్కడి భూముల ధర 2021 జూన్‌ నాటికి 60 లక్షల రూపాయల వరకూ పెరిగింది. తాజాగా రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కడంతో రియల్‌ బూమ్‌ పతాక స్థాయికి చేరింది. ఆలయ సమీపంలో ఎకరా భూమి ధర రెక్కలు తొడిగి అక్షరాలా కోటి దాటింది.

Read also: Ramayapatnam port: 36 నెలల్లో రామాయపట్నం ఓడరేవు.. ఏపీ, తెలంగాణ వాణిజ్యానికి కీలకంగా మారనున్న పోర్టు