Supreme Court: 18 నెలల కాపురానికి రూ.12 కోట్ల భరణం కోరిన భార్య… మహిళకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

ఆధునిక సమాజంలో భార్యభర్తల సంబంధం ఎప్పుడు నిలబడుతుందో.. ఎప్పుడు విడిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏడు జన్మల వరకు ఒకరికి ఒకరం అంటూ ఏడడుగులు వేసే బంధం ఏడు రోజుల్లోనే తుంచేసుకుంటున్నారు. కోర్టు మెట్లు ఎక్కుతూ భరణం కోసం బాహాబాహికి దిగుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకు చేరిన...

Supreme Court: 18 నెలల కాపురానికి రూ.12 కోట్ల భరణం కోరిన భార్య... మహిళకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court

Updated on: Jul 26, 2025 | 1:01 PM

ఆధునిక సమాజంలో భార్యభర్తల సంబంధం ఎప్పుడు నిలబడుతుందో.. ఎప్పుడు విడిపోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏడు జన్మల వరకు ఒకరికి ఒకరం అంటూ ఏడడుగులు వేసే బంధం ఏడు రోజుల్లోనే తుంచేసుకుంటున్నారు. కోర్టు మెట్లు ఎక్కుతూ భరణం కోసం బాహాబాహికి దిగుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకు చేరిన ఇలాంటి కేసు ఒకటి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భర్తతో చేసిన 18 నెలల కాపురానికి రూ.12 కోట్ల భరణం కోరింది ఓ భార్య. అంతే కాదు భరణంతో పాటు బీఎండబ్ల్యూ కారు, ఖరీదైన ప్లాట్‌ను అదనంగా ఇవ్వాలని ఆమె కోర్టును మొరపెట్టుకుంది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఓ చరిత్రాత్మక తీర్పు ఇస్తూ.. సమాజానికి, విడాకుల తర్వాత భరణాన్ని కోరే ఉద్యోగినులకు ఓ గొప్ప సందేశాన్నిఇచ్చింది. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించే సామర్థ్యం ఉన్న మహిళలు, అధిక మొత్తంలో భర్త నుంచి భరణం కోరడం కన్నా, సొంతంగా సంపాదించుకోవాలని కోర్టు కుండబద్దలు కొట్టినట్లు తీర్పు చెప్పింది. ఒక హైప్రొఫైల్ భరణం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎంబీఏ చదివిన ఓ యువతి ఐటీ ఉద్యోగం కూడా చేస్తోంది. ఒక యువకుడిని పెళ్లి చేసుకుంది. కేవలం 18 నెలల్లోనే వారి వివాహ బంధం తెగిపోయింది. మనస్పర్తల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయానికొచ్చారు. దీంతో, తన భర్త నుంచి ముంబైలో ఖరీదైన అపార్ట్మెంట్, రూ.12 కోట్లు భరణం, విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారును ఆమె భరణంగా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో ఆమె చేసిన ఈ డిమాండ్లతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయారు.

ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, న్యాయమూర్తులు జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ విచారించింది. విచారణ సమయంలో, ప్రధాన న్యాయమూర్తి ఆ మహిళ విద్యార్హతలు, వృత్తి అనుభవాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నలు వేశారు. “మీరు ఐటీ రంగంలో ఉన్నారు. ఎంబీఏ చేశారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో మీకు డిమాండ్ ఉంటుంది… మీరు ఎందుకు పని చేయకూడదు?” అంటూ సూటిగా ప్రశ్నించారు.

“కేవలం 18 నెలలపాటే వివాహ బంధాన్ని కొనసాగించారు. మీరు ఇంత భరణం కోరుతున్నారా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్థిక స్వాతంత్ర్యంతో జీవించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో ఆశించడం న్యాయసమ్మతమా అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు.

దీనికి ఆమె తన భర్త ధనవంతుడని, మానసిక ఆరోగ్య సమస్యల (శిజోఫ్రేనియా వంటివి) ఆధారంగా వివాహ రద్దు కోసం దరఖాస్తు చేశారని సమాధానమిచ్చారు.

దీంతె కోర్టు చివరకు రెండు ఆప్షన్లను ఇచ్చింది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేని అపార్ట్మెంట్‌ను భరణంగా తీసుకోండి లేదా రూ.4 కోట్లు ఒకేసారి పరిష్కారంగా తీసుకోండి అని అన్నారు.

“మీరు చదువుకున్నవారు. మీకు మీరు సంపాదించుకోండి దయచేసి దీనితో (లభించిన ఆస్తి/డబ్బుతో) గౌరవంగా జీవించండి. ఎవరిపైనా ఆధారపడకండి” అని CJI గవాయి ఆమెకు స్పష్టంగా చెప్పారు.

వారు నాపై అభియోగాలు మోపారు..FIR కూడా నమోదు చేశారు. అలాంటప్పుడు ఏ ఉద్యోగం వస్తుంది? అని మహిళ వాపోయింది. దానికి సీజేఐ సమాధానం ఇస్తూ మేం దానిని కూడా రద్దు చేస్తాం. కానీ జీవితాన్ని మీరు కూడా నిలబెట్టుకోవాలని చెప్పారు.

ఇలా చాలా ఆసక్తికరంగా సాగింది సుప్రీంకోర్టులో విచారణ. పిటిషనర్ అయిన మహిళ డిమాండ్లను విని అవాక్కయిన చీఫ్ జస్టిస్.. చివరికి ఆమె కోరికలకు కళ్లెం వేస్తూ..భర్త ఇచ్చే భరణంతోపాటు తన పోషణకు తాను కూడా పనిచేయాలని ఆ మహిళను ఆదేశించారు.