
టీవీ9 నెట్వర్క్ నిర్వహిస్తున్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే'(WITT) సమ్మిట్ 2026 రెండో రోజు ‘సత్తా సమ్మేళనం’లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కె. శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ రాజకీయాలు, అస్సాం ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అస్సాం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని డి.కె. శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో పార్టీ ఐక్యంగా ఉందని, అక్కడ కొత్త అవినీతి రహిత యువ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. గత 10 ఏళ్లుగా అక్కడ కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా, ఈసారి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు.
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని, బీజేపీ హవా కూడా ఒకరోజు ముగుస్తుందని శివకుమార్ అన్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై మండిపడుతూ.. “కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను తానే నిర్ణయిస్తానని ఆయన అనడం పగటి కలలు కనడమే” అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. బీజేపీలోని అనేకమంది నేతలు ఆ పార్టీలో ఇమడలేక ఇబ్బందులు పడుతున్నారని, సరైన సమయంలో వారు స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ సమయం మళ్ళీ రాబోతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తోందని శివకుమార్ చెప్పారు. హిందూ నాయకులందరూ బీజేపీతోనే ఉన్నారన్న హిమంత బిస్వా శర్మ వాదనను ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.