
పశ్చిమ బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమరం నేడు (ఏప్రిల్ 23, 2026) ఘనంగా ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలు బెంగాల్ వర్తమానంతో పాటు భవిష్యత్తును నిర్దేశించేవి కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ ప్రజాస్వామ్య పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. హోం మంత్రి అమిత్ షా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, “చొరబాటుదారులు, కట్-మనీ, సిండికేట్ పాలన నుండి బెంగాల్ను విముక్తం చేయడానికి బలమైన నాయకత్వం అవసరమని” పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ‘సోనార్ బంగ్లా’ నిర్మాణం కోసం ఓటర్లు ముందుగా ఓటు వేసి, ఆ తర్వాతే అల్పాహారం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మొదటి దశలో 3.6 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. వీరిలో 1.75 కోట్ల మంది మహిళలు కాగా, 465 మంది థర్డ్-జెండర్ ఓటర్లు ఉండటం విశేషం. భద్రత విషయంలో రాజీ పడకుండా రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల పారామిలిటరీ దళాలను సుమారు 2.5 లక్షల మంది సిబ్బంది మోహరించారు. 8,000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టారు. మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది.
మొదటి దశలో ఉత్తర బెంగాల్లోని 54 స్థానాలు ఉండటం రాజకీయంగా అత్యంత కీలకం. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ బలపడగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. గత ఎన్నికల్లో (2021) ఈ 152 స్థానాల్లో తృణమూల్ 93, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ఈసారి మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తుండగా, బీజేపీ ఉత్తర బెంగాల్ను తన కోటగా మార్చుకోవాలని వ్యూహరచన చేస్తోంది.
ఈ దశలో నందిగ్రామ్ నుండి ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, మాతాభంగా నుండి నిసిత్ ప్రమణిక్, దిన్హటా నుండి రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ, సిలిగురి నుండి గౌతమ్ దేబ్, బహరంపూర్ నుండి కాంగ్రెస్ దిగ్గజం అధిర్ రంజన్ చౌదరి వంటి ఉద్దండులు బరిలో ఉన్నారు. కాగా, దాదాపు 91 లక్షల పేర్లను తొలగించిన కొత్త ఓటర్ల జాబితాతో జరుగుతున్న ఈ ఎన్నికలు అనేక మార్పులకు వేదికగా మారుతున్నాయి. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, తుది ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..