ఆందోళన వద్దు.. దేశంలో ఇంధన, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి! కేంద్ర కీలక ప్రకటన

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల మధ్య భారత్ నిత్యావసరాల లభ్యత, సరఫరాపై కేంద్రం సమీక్షించింది. దేశంలో ఇంధనం, ఎరువులు, ఆహార ధాన్యాల నిల్వలు పటిష్ఠంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. ఇంధన కంపెనీల నష్టాలను ప్రభుత్వం భరిస్తూ, సబ్సిడీలను అందిస్తూ ధరలను స్థిరీకరిస్తోంది. 'ఖరీఫ్ 2026' కు ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, మొత్తం మీద భారత్ ఆహార, ఇంధన భద్రత పటిష్ఠంగా ఉందని కేంద్రం ప్రకటించింది.

ఆందోళన వద్దు.. దేశంలో ఇంధన, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి! కేంద్ర కీలక ప్రకటన
West Asia Crisis India Supply Chain

Updated on: May 27, 2026 | 9:33 PM

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో నిత్యావసర వస్తువుల లభ్యత, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష చేసింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్‌నాత్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో ఇంధన సరఫరా సాధారణంగానే ఉందని..పౌరులు ఎలాంటి భయాందోళనలకు గురై పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజిలను ముందస్తుగా కొనుగోలు చేయవద్దని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వినియోగం 243.2 మెట్రిక్ టన్నులుగా ఉండగా, భారతదేశం 258.1 మెట్రిక్ టన్నుల వార్షిక స్థాపిత సామర్థ్యంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనరీ దేశంగా అవతరించిందని తెలిపారు. ఏటా సుమారు 61.5 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. కాబట్టి దేశంలో ఇంధన కొరత వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ కారణంగా చమురు ధరలు భారీగా పెరగాయని.. ఆ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు మోస్తూ సామాన్య రిటైల్ వినియోగదారులపై పడకుండా చూస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఈ కంపెనీలు రోజుకు సుమారు రూ. 550 కోట్ల నష్టాలను భరించాల్సి వస్తుందన్నారు. ఈ సబ్సిడీ వెసులుబాటు కేవలం సాధారణ రిటైల్ వినియోగదారుల కోసమేనని. పారిశ్రామిక, వాణిజ్య డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ రేట్ల ప్రకారమే ఉంటాయని. అయితే, కొందరు పారిశ్రామిక వినియోగదారులు తక్కువ ధరకు లభించే రిటైల్ బంకుల్లో కొనుగోళ్లు చేయడం, కొందరు డీలర్లు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటం వంటి ఉదంతాలు వెలుగులోకి రావడంతో.. చమురు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేశాయన్నారు.

అలాగే దేశంలో ఎరువుల లభ్యత కూడా అవసరమైన మేరకు ఉందని ఐజీఓఎం ప్రకటించింది. రాబోయే ‘ఖరీఫ్ 2026’ సీజన్ కోసం వ్యవసాయ శాఖ 390.54 LMT ఎరువులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే దేశంలో 200.47 LMT (51% కంటే ఎక్కువ) నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సాధారణంగా ఈ సమయానికి 33% నిల్వలు ఉండాలి, కానీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అంతకంటే ఎక్కువ నిల్వలను సమకూర్చిందని తెలిపారు. సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఉత్పత్తి, దిగుమతుల ద్వారా మొత్తం 122.4 ఎల్‌ఎమ్‌టీ (LMT) ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. అదనంగా మే, జూన్ నెలల్లో గరిష్ట సాగు సీజన్ కోసం హార్ముజ్ జలసంధి (SOH) వెలుపలి ప్రాంతాల నుండి 15 LMT ల DAP, 10 LMT ల NPK ఎరువులను భారత్ సురక్షితంగా రప్పించుకుంటోంది.

India Essential Supplies

దేశంలో ఆహార ధరలు పెరగకుండా స్థిరంగా ఉంచాలంటే రైతులకు సకాలంలో ఎరువులు, వ్యవసాయ ఉత్పాదకాలు అందడం కీలకమని కేంద్రమంత్రి తెలిపారు. ఇందుకోసం ‘కార్యదర్శుల సాధికార బృందం’ ఇప్పటికే 10 సార్లు సమావేశమై సరఫరా సవాళ్లను అధిగమించిందన్నారు. ఎరువుల కంపెనీల సబ్సిడీ బిల్లులను కూడా ప్రభుత్వం వారానికోసారి క్రమం తప్పకుండా చెల్లిస్తోందన్నారు. మరోవైపు, సంక్షోభ సమయంలో పరిశ్రమలను, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (MSMEలు) ఆదుకునేందుకు ప్రభుత్వం అందించిన ‘అత్యవసర రుణ హామీ పథకం’ (ECLGS) పై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు మొత్తంగా, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతదేశ ఆహార, ఇంధన భద్రత అత్యంత బలంగా మరియు సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us