
ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యా జిల్లాలో పెళ్లి వేడుకల్లో జరిగిన ఒక విచిత్రమైన వివాదం చివరకు పెళ్లి రద్దుకు దారితీసింది. పూలమాలలు మార్చుకునే సమయంలో వధూవరుల మధ్య మొదలైన చిన్న గొడవ, కాబోయే భర్త శారీరక ఆకృతిపై వధువు చేసిన కామెంట్లతో పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. చివరకు ఇటావా నుండి వచ్చిన పెళ్లి ఊరేగింపు బారాత్ వధువు లేకుండానే ఖాళీ చేతులతో వెనుదిరిగింది.
అచ్చల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని దివారియా గ్రామంలో శుక్రవారం (జూన్ 26) రాత్రి ఈ సంఘటన జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో బాజాభజంత్రీలు, బంధువుల కోలాహలం మధ్య వధూవరులు పూలమాలలు మార్చుకోవడానికి వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో ఏదో చిన్న విషయమై పెళ్లికూతురి సోదరుడికి, పెళ్లికొడుకుకు మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా పెద్దదై ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ గందరగోళం మధ్య పెళ్లికూతురు అందరి ముందూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, పెళ్లికొడుకు మరీ సన్నగా ఉన్నాడని, అతడిని తాను భర్తగా అంగీకరించనని బహిరంగంగా ప్రకటించింది. వధువు మాటలకు అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వరుడి తరఫు వారు, పెద్దలు ఎంత నచ్చజెప్పినా వధువు తన పట్టు వదల్లేదు. వివాదం ముదరడంతో ఎవరో యూపీ డయల్ 112కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో అర్ధరాత్రి పంచాయితీ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగినా వధువు మనసు మార్చుకోలేదు.
చివరికి ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వరుడి కుటుంబం పెళ్లి తంతు పూర్తికాకుండానే ఇటావాకు తిరుగుపయనమైంది. గంటల వ్యవధిలోనే పెళ్లి పందిరి కాస్తా నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ వింత ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతమంతటా హాట్ టాపిక్గా మారింది. అయితే, ఈ గొడవ కేవలం పూలమాలల సమయంలో జరిగింది కాదని, వధువుకు ఈ సంబంధం మొదటి నుండి ఇష్టం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఇరుపక్షాల నుంచి పోలీసులకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..