
తెలుగు రాష్ట్రాలపై కేంద్ర జల్శక్తి శాఖ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర జల్శక్తి కార్యదర్శి యు.పి.సింగ్ గురువారం కృష్ణా, గోదావరి బోర్డు ఛైర్మన్లతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని కొత్త ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం అదనపు సమాచారాన్ని కోరినట్లు సమాచారం.
ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన బోర్డు సమావేశాల్లో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లను ఈనెల 10లోగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది కేంద్ర జల్శక్తి శాఖ. అయితే, ఇప్పటికీ డీపీఆర్లు ఇవ్వలేదని కేంద్ర జల్శక్తి కార్యదర్శి యు.పి.సింగ్ బోర్డుల చైర్మన్లు వివరించారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు అడిగినా ఇంకా ఇవ్వలేదని, ఈ ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లొద్దని సూచించినా ఎలాంటి సమాధానం లేదని రెండు రోజుల క్రితం అధికారులు జల్శక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా అని బోర్డుల ఛైర్మన్లను కేంద్ర కార్యదర్శి అడిగినట్లు తెలుసుకున్నారు.
దీనిపై యూపీ సింగ్ స్పందిస్తూ.. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన అనుమతుల్లో ఏమి వచ్చాయి, ఇంకా రావాల్సినవి ఎన్ని ఉన్నాయి తదితర వివరాలను త్వరగా పంపాలని అధికారులకు యు.పి.సింగ్ సూచించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాల ని మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని ఆదేశించారు. ఆ లేఖలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఎజెండా పంపాలని కోరాలని బోర్డుల చైర్మన్లకు సూచించారు. అప్పటికీ రెండు రాష్ట్రాలు స్పందించకపోతే..మీరే అపెక్స్ కౌన్సిల్కు ఎజెండా సిద్ధం చేసి పంపాలని బోర్డు చైర్మన్లకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.