
గోరఖ్పూర్, ఆగస్టు 1: శాంతి భద్రతల విషయంలో వెనక్కి తగ్గే పనేలేదని.. కఠినంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి అధికారులను ఆదేశించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ఉదయం గోరఖ్నాథ్ ఆలయంలో ‘జనతా దర్శన్’ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గొడును చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను కలిసి.. వారి సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఒకరి భూమిని ఆక్రమించుకున్న వారిని, బలహీనులను నాశనం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్ అధికారులను మరోసారి ఆదేశించారు. ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయదని.. అన్యాయం చేసేవారిని వదిలిపెట్టదని.. ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని నిశ్చయించుకుందని యోగి తెలిపారు.
గోరఖ్నాథ్ ఆలయంలో సీఎం యోగి దాదాపు 400 మందిని కలిసి వారి సమస్యలను విని.. అధికారులకు పలు సూచనలు చేశారు. తన హయాంలో ఎవరికీ అన్యాయం జరగదని అందరికీ భరోసా ఇచ్చారు. ప్రతి బాధితుడి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హామీ ఇచ్చారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath holds ‘Janata Darshan’ in Gorakhpur. pic.twitter.com/7mLWrKEIhb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 31, 2023
ఈ సమయంలో, చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ చాలా మంది సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. చికిత్సకు ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందజేస్తుందని సీఎం యోగి వారికి హామీ ఇచ్చారు. చికిత్సకు సంబంధించిన అంచనాల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ప్రభుత్వం ద్వారా వారికి సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ, పోలీసులకు సంబంధించిన అంశాలను పూర్తి పారదర్శకంగా, న్యాయంగా పరిష్కరించాలని, ఎవరికీ అన్యాయం జరగకూడదని, ప్రతి బాధితురాలిని సున్నితత్వంతో ఆదుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..