Rahul Gandhi: ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాల్సిందే.. రాష్ట్రపతిని కోరిన కాంగ్రెస్ బృందం..

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసింది. యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటనపై రాష్ట్రపతికి వినతి పత్రం అందించింది...

Rahul Gandhi: ఆ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాల్సిందే.. రాష్ట్రపతిని కోరిన కాంగ్రెస్ బృందం..
Rahulu

Updated on: Oct 13, 2021 | 2:24 PM

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బుధవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసింది. యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటనపై రాష్ట్రపతికి వినతి పత్రం అందించింది. అక్టోబర్ 3 న జనంపైకి కారు దూసుకెళ్లి నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారని బృందం కోవింద్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ బృందంలో రాహుల్‌ వెంట ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌, గులాం నబీ ఆజాద్‌, అధిర్‌ రంజన్‌ చౌధరీ ఉన్నారు. మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనకు ముందు అజయ్ మిశ్రా రైతులను బెదిరించాడని ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలన్నారు.

తాము లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించామని చెప్పారు. వారు ప్రధానంగా రెండు డిమాండ్లు తమ ముందు ఉంచారని పేర్కొన్నారు. హత్య వెనుక ఉన్న వ్యక్తి శిక్షించాలని, నిందితుడి తండ్రిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. అజయ్ మిశ్రా పదవిలో ఉన్నంత కాలం న్యాయం జరగదని రాహుల్ అన్నారు.

Read Also.. Virat Kohli: విరాట్ కోహ్లీ ఎప్పుడూ మంచి వ్యూహకర్త కాదు.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు