“సీఏఏ”ని వ్యతిరేకించే వారంతా దళిత వ్యతిరేకులేనన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. పొరుగుదేశాలైన పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చిన దళితులకు.. వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా మీరు సాధించేదేందంటూ విపక్షాలను నిలదీశారు.
శనివారం కర్ణాటకలోని హుబ్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మతప్రాతిపదికన ముక్కలు చేసిందంటూ మండిపడ్డారు. అసలు సీఏఏపై రాహుల్ గాంధీకి ఏం తెలుసన్నారు. అనవసరంగా సీఏఏపై ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి.. దేశంలోని ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ చట్టంలో ముస్లింల పౌరసత్వాన్ని లాక్కునే క్లాజులేమీ లేవన్నారు.
ఈ చట్టంలో భారతీయ ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేస్తారని రాహుల్ వంటి వారు ఆరోపిస్తున్నారనీ.. కానీ దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. మొదట ఈ చట్టం గురించి సమగ్రంగా తెలుసుకోవాలని ఆయన కోరారు.