ఆ జిల్లా ‘పెద్దపులుల సంతానోత్పత్తి’ కేంద్రం!

| Edited By: Pardhasaradhi Peri

Jul 30, 2020 | 1:22 PM

దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూ కొండలు, లోయలు, సహజ సిద్ధమైన నీటి వనరులు, గలగల పారే జలపాతాలు, పచ్చని పచ్చిక బైళ్లు, శాఖాహార జంతువులకు నెలవు ఆ జిల్లా. ఈ ప్రాంతాన్ని సంతానోత్సత్తికి ఎంచుకుని పెద్దపులి ఫాల్గుణ నాలుగు పిల్లలకు జన్మనివ్వడం శుభ పరిణామం అని..

ఆ జిల్లా ‘పెద్దపులుల సంతానోత్పత్తి’ కేంద్రం!
Follow us on

దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూ కొండలు, లోయలు, సహజ సిద్ధమైన నీటి వనరులు, గలగల పారే జలపాతాలు, పచ్చని పచ్చిక బైళ్లు, శాఖాహార జంతువులకు నెలవు ఆ జిల్లా. పైగా ఓ వైపు మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం, కవ్వాల్ అటవీ ప్రాంతాలు కల్గి ఉండటంతో ఉత్తర, దక్షిణ భారతదేశాల నుండి పులులు విరివిగా రాకపోకలు సాగిస్తుంటాయి. అంతేకాదు, అక్కడే హాయిగా సేదతీరుతున్న పెద్దపులులు ఆ ప్రాంతాన్ని తమ సంతానోత్పత్తకి అనువుగా మార్చుకుంటున్నాయి. అదే మన తెలంగాణ రాష్ట్రంలోని కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం.

కాగజ్‌నగర్ డివిజన్ పెద్దపులుల సంతానోత్పత్తకి అనువైన ప్రాంతంగా మారుతోంది. కాగజ్‌నగర్ డివిజన్‌లో కడంబా టైగర్‌డెన్‌లాంటి గృహలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని సంతానోత్సత్తికి ఎంచుకుని పెద్దపులి ఫాల్గుణ నాలుగు పిల్లలకు జన్మనివ్వడం శుభ పరిణామమని చెప్పవచ్చు. పెద్దపులి ఫాల్గుణతో ప్రారంభమైన సంతానోత్పత్తి అంచలంచలుగా వాటి సంతతిని పెంచుకుంటూ దాదాపు ఎనిమిది పులులకు జన్మనిచ్చి ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం పెద్దపులి ఫాల్గుణను గుర్తించి పోస్టల్‌ స్టాంప్‌గా విడుదల చేయడం కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌కు ఎంతో గర్వకారణమని అన్నారు కాగజ్‌నగర్‌ డివిజన్‌ వైల్డ్‌లైఫ్‌ ఇంచార్జి ఎఫ్‌ఆర్‌ఓ వేణుగోపాల్‌.

ఈ ప్రాంతంలో 5 పెద్ద పులులు ఉన్నాయని, కాగజ్‌నగర్‌ ప్రాంతంలో మరో మూడు పులులు నివాసం ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు.  వాటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాంతం దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మద్య ప్రాంతంగా ఉందని, మహారాష్ట్ర నుండి ఈ ప్రాంతం లోనికి వచ్చి ఇంద్రావతి, ఏటూరునాగారం వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయిన, ఈ ప్రాంతంలో కొంత వరకు నివాసం ఉంటూ ఆడపులులతో కలిసి సంతానోత్పత్తిని చేస్తున్నాయని తెలిపారు. అటవీ శాఖ మరిన్ని చర్యలు తీసుకుని వాటి సంఖ్యను మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్దపులుల పెరుగుదలతో అడవులు అభివృద్ది చెందుతాయని వైల్డ్‌లైఫ్‌ ఇంచార్జి ఎఫ్‌ఆర్‌ఓ వేణుగోపాల్‌ పేర్కొన్నారు.