Spa Murder Case: సినీ ఫక్కీలో వ్యక్తి దారుణ హత్య.. హంతకులను పట్టించిన పచ్చబొట్టు!

|

Jul 26, 2024 | 5:36 PM

స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి శరీరంపై వేయించుకున్న పచ్చబొట్టు హంతకులను గంటల వ్యవధిలోనే పట్టించింది. ముంబైలోని గురు వాఘ్మారే (48) అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని, వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అనుకున్నట్లుగానే అతన్ని ఇటీవల స్పా సెంటర్‌లో దుండగులు హత్య చేశారు. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ద్వారా 22 మంది పేర్లు..

Spa Murder Case: సినీ ఫక్కీలో వ్యక్తి దారుణ హత్య.. హంతకులను పట్టించిన పచ్చబొట్టు!
Spa Murder Case
Follow us on

ముంబై, జులై 26: స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి శరీరంపై వేయించుకున్న పచ్చబొట్టు హంతకులను గంటల వ్యవధిలోనే పట్టించింది. ముంబైలోని గురు వాఘ్మారే (48) అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని, వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అనుకున్నట్లుగానే అతన్ని ఇటీవల స్పా సెంటర్‌లో దుండగులు హత్య చేశారు. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ద్వారా 22 మంది పేర్లు పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. అరెస్టయిన వారిలో స్పా యజమాని సంతోష్ షెరేకర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతనితో పాటు, హత్యకు సహకరించిన మరో ఇద్దరు దుండగులను కూడా అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే..

మృతుడు వాఘ్‌మారేపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బుధవారం తెల్లవారుజామున సెంట్రల్ ముంబైలోని వర్లీలోని సాఫ్ట్ టచ్ స్పాలో అతడు హత్యకు గురయ్యాడు. శవపరీక్ష సమయంలో అతడి తొడలపై తన శత్రువుల పేర్లను రాసుకున్నట్లు తేలిందని ఓ అధికారి తెలిపారు. వాఘ్‌మారే దోపిడీ బెదిరింపులతో విసిగిన స్పా యజమాని షెరేకర్.. వాఘ్‌మారేని చంపడానికి పథకం పన్నినట్లు తెలుస్తుంది. వాగ్మారేను హత్య చేసేందుకు మహ్మద్ ఫిరోజ్ అన్సారీ (26)కి రూ. 6 లక్షలు ‘సుపారీ’ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఫిరోజ్ అన్సారీ, షెరేకర్‌తోపాటు మరొకరు కలిసి ముంబై సమీపంలోని నల్లసోపరా వద్ద స్పాను నడుపుతున్నారు. గతేడాది అందులో జరిగిన దాడి కారణంగా స్పాను మూసివేశారు. వాఘ్‌మారే అధికారులకు ఫిర్యాదు చేయడం వల్లనే ఈ దాడి జరిగినట్లు అధికారి తెలిపారు. వాఘ్‌మారే తరచూ స్పాలపై ఇటువంటి ఫిర్యాదులు చేయడం, స్పా యజమానుల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేయడం పరిపాటి. అతడి అకృత్యాలతో విసిగిన షెరేకర్.. అన్సారీని సంప్రదించాడు. వాఘ్‌మారేను హత్య చేయమని షేరేకర్ తనను కోరినట్లు పోలీసుల ఎదుట తెలిపాడు. దీంతో అన్సారీ ఢిల్లీ నివాసి సాకిబ్ అన్సారీని సంప్రదించగా, మూడు నెలల క్రితమే హత్యకు కుట్ర పన్నారు. మూడు నెలల పాటు వాఘ్‌మారే దినచర్యను అధ్యయనం చేసి, అతనిని షేరేకర్ స్పాలోనే చంపాలని నిందితులు ప్లాన్ చేశారు. మంగళవారం సాయంత్రం వాఘ్‌మారే తన గర్ల్‌ ఫ్రెండ్‌ (21)తో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుపుకున్నట్లు సియోన్‌లోని బార్ వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. అయితే అక్కడ రెయిన్‌కోట్‌ ధరించిన ఇద్దరు దుండగులు అతడిని ఫాలో అయ్యారు. అదేరోజు రాత్రి ఆ ఇద్దరూ వాఘ్‌మారేను స్కూటర్‌పై షెరేకర్ స్పాకు తీసుకొచ్చారు. దుండగుల్లో ఒకరు మద్యం బార్ సమీపంలోని పాన్ షాపులో యూపీఐ విధానంలో చెల్లించి రెండు గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి

యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీగా తేలింది. అన్సారీ UPI IDకి లింక్ అయిన ఫోన్ నంబర్‌కి షెరేకర్‌ పలుమార్లు ఫోన్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఫిరోజ్, అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో స్పాలోకి ప్రవేశించి, వాఘ్‌మారే గర్ల్‌ ఫ్రెండ్‌ను మరొక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం కత్తెర, బ్లేడ్‌లను ఉపయోగించి వాఘ్‌మారేను హత్య చేశారు. బ్లేడ్‌లలో ఒకటి అతని గొంతు కోసేందుకు, మరొకటి కడుపులో పొడిచేందుకు ఉపయోగించారు. వాఘ్‌మారే గర్ల్‌ఫ్రెండ్‌ బుధవారం ఉదయం 9.30 గంటలకు హత్య గురించి తెలుసుకుని, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటికే షెరేకర్‌ను అరెస్ట్‌ చేయగా.. మొత్తం ఐదుగురిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అలాగే వాఘ్‌మారే గర్ల్‌ఫ్రెండ్ పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు ఓ పోలీసధికారి తెలిపారు. కాగా వాఘ్‌మారే 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్‌లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసేవాడని, అతనిపై దోపిడీ, అత్యాచారం, వేధింపుల క్రిమినల్ కేసులు నమోదయినట్లు పేర్కొన్నారు. ఘ్‌మారేపై 8ద కాగ్నిసబుల్ కేసులు, 22 నాన్ కాగ్నిసబుల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.