
ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు అని తమిళనాడు సీఎం విజయ్ చాటిచెప్పారు. తనకు బాగా సన్నిహితుడైన రాధన్ పండిట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. రాధన్ కేవలం జ్యోతిష్యుడేగాదు, TVK పార్టీ సభ్యుడు కూడా. ఆయన్ను తన OSDగా నియమించారు విజయ్. అయితే ఈ నియామకంపై విమర్శలు రాగానే, వెనక్కి తగ్గారు. అసెంబ్లీలోనే మిత్రపక్షాలు నిలదీస్తే, ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వెంటనే నిర్ణయం ప్రకటించారు. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు చేస్తూ.. తాజాగా TVK సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
మే 12న జారీ చేసిన నియామక ఉత్తర్వులను.. మే 13న ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన నోట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తాను ఎలాంటి బేషజాలకు పోను అని.. విపక్షాల సూచనలు స్వీకరిస్తానని ఈ నిర్ణయంతో విజయ్ చెప్పకనే చెప్పారు.
బల పరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..
బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్ నెగ్గారు. ఆయనకు మద్దతుగా 144 మంది ఓటు వేయగా.. వ్యతిరేకంగా 22 మంది నిలిచారు.
విజయ్కి మద్దతుగా 25మంది ADMK చీలిక వర్గం ఎమ్మెల్యేలు ఓటేశారు. ఓటింగ్కి ముందే సభ నుంచి DMK వాకౌట్ చేసింది. విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, VCK, CPI, CPM, IUML మద్దతు తెలిపాయి.
తమది ప్రజా ప్రభుత్వం.. ప్రజాపాలన అన్నారు సీఎం విజయ్. తమది బలహీన వర్గాల ప్రభుత్వం.. అన్ని వర్గాలకు తమపై నమ్మకం ఉందన్నారు. తమ ప్రభుత్వంలో అందరికి సమాన అవకాశాలు ఉంటాయన్నారు. తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడేళ్లలోనే 34.92 శాతం ఓటింగ్ సాధించామని.. అధికారంలో ఉన్నామని ఎవరినీ బెదిరించమన్నారు. తమ ప్రభుత్వంలో సాహసంతో కూడిన నిర్ణయాలుంటాయన్నారు.
అసెంబ్లీలో సీఎం విజయ్పై ఘాటు విమర్శలు చేశారు DMK ఉదయనిధి స్టాలిన్. 65 శాతం ప్రజలు.. విజయ్ని తిరస్కరించారన్నారు. మెజారిటీ తమిళ ప్రజలు.. విజయ్కి ఓటేయలేదన్నారు ఉదయనిధి. విజయ్కి ప్రజల విశ్వాసం దక్కలేదు.. అందుకే TVKకి మ్యాజిక్ ఫిగర్ రాలేదన్నారు. తప్పుడు హామీలతో ప్రజలను విజయ్ మోసం చేశారని విమర్శించారు. విజయ్కి ఓటు ఎందుకు వేశామోనని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. పుష్ప సినిమా స్టైల్లో విజయ్ పాలన సాగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను విజయ్ కలవడం మంచి రాజకీయం కాదన్నారు. సీఎం విజయ్పై ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను కలవడంతో అది నిజమే అనిపిస్తోందన్నారు. ఇక, విశ్వాస పరీక్షలో తాము పాల్గొనడం లేదన్న ఉదయనిధి.. సభ నుంచి వాకౌట్ చేశారు.