Covid Vaccine : కోవిడ్ టీకా పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. టీకా లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని పేర్కొంది. సాధ్యమైన వైద్య కేంద్రాల్లో ఒకటికి మించి వ్యాక్సినేషన్ సెషన్లను నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ఫిబ్రవరి చివరి వారం నుంచి కోవిడ్ ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా పంపిణీ ప్రారంభించాలని పేర్కొంది.
పలు రాష్ట్రాల్లో టీకా తీసుకున్న లబ్ధిదారుల కవరేజీ 50 శాతం కన్నా కాస్త ఎక్కువ ఉందని.. అయితే ఆయా రాష్ట్రాలన్నీ కవరేజీని పెంచాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని కోరారు. కరోనా టీకా డోసులు కావాల్సినన్ని నిల్వ ఉన్నాయని తెలిపారు. కోవిన్ యాప్లో సాంకేతిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని.. వాటిని వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ కార్యదర్శి సూచించారు. తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఒక్కో సెషన్లో ఇచ్చే టీకాల సంఖ్యను మరింత పెంచడానికి తగినంత ఆస్కారం ఉందని చెప్పారు. సాధ్యమైన వైద్య కేంద్రాల్లో ఒకటికి మించి వ్యాక్సినేషన్ సెషన్లను నిర్వహించాలని అన్నారు. ఇలా చేయడం వల్ల రోజువారి వ్యాక్సినేషన్ సంఖ్య పెరుగుతుందన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సంబంధిత సెషన్ల నోడల్ అధికారులతో సంప్రదించి.. ఈ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నించాలని అన్నారు. ప్రాధాన్య జాబితాలో ఉన్న వ్యక్తులకే టీకా ఇవ్వాలని స్పష్టం చేశారు భూషణ్. వారిని జాగ్రత్తగా గుర్తించాలని అన్నారు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్లోకి తొలి ట్రాన్స్జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..