Love in Prison: జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ.. పెళ్లికి సిద్దమైన హత్య కేసు ఖైదీ జంట..!

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఓపెన్ జైలు నుంచి వెలుగులోకి వచ్చిన ఓ ప్రేమకథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలు ప్రాంగణంలోని పొలాల్లో పనిచేసే సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తాజాగా రాజస్థాన్ హైకోర్టు అనుమతితో వీరిద్దరూ జూలై 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

Love in Prison: జైలు గోడల మధ్య పుట్టిన ప్రేమ.. పెళ్లికి సిద్దమైన హత్య కేసు ఖైదీ జంట..!
Love In Prison

Updated on: Jul 16, 2026 | 7:54 PM

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఓపెన్ జైలు నుంచి వెలుగులోకి వచ్చిన ఓ ప్రేమకథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు జైలు ప్రాంగణంలోని పొలాల్లో పనిచేసే సమయంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తాజాగా రాజస్థాన్ హైకోర్టు అనుమతితో వీరిద్దరూ జూలై 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

జోధ్‌పూర్‌లోని మండోర్ ఓపెన్ ఎయిర్ క్యాంపులో శిక్ష అనుభవిస్తున్న ములారామ్, సీమల మధ్య పరిచయం ఏర్పడి అది క్రమంగా ప్రేమగా మారింది. ఓపెన్ జైలులో ఖైదీలకు కల్పించే పనుల్లో భాగంగా పొలాల్లో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరూ కలుసుకున్నారని సమాచారం. కొంతకాలం పరస్పరం మాట్లాడుకున్న అనంతరం జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈ వివాహానికి అనుమతి కోరుతూ వారు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు డాక్టర్ పుష్పేంద్ర సింగ్ భాటి, ప్రవీర్ భట్నాగర్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వయోజనులు తమ స్వేచ్ఛా సంకల్పంతో వివాహం చేసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని పేర్కొంది.

నాగౌర్ జిల్లాకు చెందిన ములారామ్ హత్య, సాక్ష్యాల ధ్వంసం, ఆస్తి దుర్వినియోగం వంటి కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్నాడు. మంచి ప్రవర్తన కారణంగా అతడిని మండోర్ ఓపెన్ ఎయిర్ క్యాంపులో ఉంచారు. మరోవైపు, సీమ కూడా తన భర్త హత్య కేసులో శిక్ష అనుభవిస్తోంది. ప్రస్తుతం ఆమె పెరోల్‌పై బయట ఉన్నట్లు సమాచారం. తాము స్వచ్ఛందంగా వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నామని, ఈ వివాహం తమ జీవితాల్లో కొత్త ప్రారంభానికి, సామాజిక పునరావాసానికి దోహదపడుతుందని ఇద్దరూ కోర్టుకు తెలిపారు. ఈ వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు నివేదిక సమర్పించింది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం జూలై 22న నిర్ణయించిన నిబంధనలు, భద్రతా ఏర్పాట్ల మధ్య వివాహం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి గరిష్టంగా 21 మంది సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. పెళ్లి ఖర్చులను ఇరువర్గాలే భరించాల్సి ఉంటుంది. ఈ ఘటన కేవలం ప్రేమకథగానే కాకుండా, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కూడా గౌరవప్రదమైన జీవితం, పునరావాస అవకాశాలు ఉండాలనే అంశంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us