ప్రధాని నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ నిర్వహించబోతోన్న సమావేశంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. తొలుత కోటి మంది హెల్త్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ అందించే దిశగా నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రజారోగ్యం కోసం పోరాడినవారికే తొలి ప్రాధాన్యమని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బంది డాటా సేకరణకు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఈ మేరకు ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ ఒక ప్రకటన చేయనున్నారు. సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే పౌల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. జులై 2021 నాటికి 20-25 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికలు రూపొందించి ఈ మేరకు ముఖ్యమంత్రులకు సమాచారం ఇవ్వబోతున్నారు.