
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారతదేశ ఆర్థిక రథాన్ని మరింత వేగంగా ముందుకు నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో న్యూఢిల్లీలో ఒక కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర గందరగోళం, హెచ్చుతగ్గులు కొనసాగుతున్న తరుణంలో.. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటును మరింతగా ఎలా బూస్ట్ చేయాలనే అంశంపై ప్రధాని ఈ బృందంతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ కీలక సమావేశంలో ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం, ఆ ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై ఆర్థిక నిపుణులు ప్రధానికి ఒక సమగ్రమైన అంచనాను సమర్పించారు. క్రూడ్ ఆయిల్ ధరలు, అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సందర్భంగా చర్చించారు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం భయాలతో కొట్టుమిట్టాడుతున్నా.. భారత్ మాత్రం స్థిరమైన వృద్ధిని ఎలా సాధించాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేశారు.
భారతదేశంలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడమే కాకుండా,సాధారణ పౌరుడి జీవితాన్ని సులభతరం చేయడానికి మరికొన్ని కీలక సంస్కరణలు తీసుకురావడంపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో ఫోకస్ పెట్టారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ : దేశంలో వ్యాపారాలు, స్టార్టప్లు పెట్టుకోవడానికి ఉన్న నిబంధనలను మరింత సరళతరం చేయడం, పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించడం ద్వారా సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.
ఈజ్ ఆఫ్ లివింగ్ : సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, ప్రభుత్వ సేవలను మరింత వేగంగా ప్రజల దరి చేర్చడం వంటి పలు కీలక చర్యలపై ఆర్థిక సలహా మండలి సభ్యులు తమ వినూత్న ఆలోచనలను ప్రధాని ముందుంచారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక తుఫానులు ముంచుకొస్తున్నా.. పటిష్టమైన విధానాలు, సంస్కరణల ద్వారా భారతదేశాన్ని సురక్షిత తీరానికి చేర్చడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ ఆర్థిక సమీక్ష అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
PM Narendra Modi chairs a meeting with members of the PM-Economic Advisory Council.
PM and the EAC discussed various ideas and measures to further boost India’s economic growth in times of global turmoil. Various reforms to improve ease of living and ease of doing business were… pic.twitter.com/8eDoam9Jut
— ANI (@ANI) June 6, 2026