రైతు సంఘాల ప్రతినిధులతో కొనసాగుతున్న కేంద్రం చర్చలు.. మూడు గంటలుగా సాగుతున్న భేటీ..

|

Dec 05, 2020 | 6:10 PM

వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ శివారులో రైతులు ఆందోళన చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం ఇది మూడోసారి.

రైతు సంఘాల ప్రతినిధులతో కొనసాగుతున్న కేంద్రం చర్చలు.. మూడు గంటలుగా సాగుతున్న భేటీ..
Follow us on

వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ శివారులో రైతులు ఆందోళన చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం ఇది మూడోసారి. ఇప్పటికే మంగళ, గురువారాల్లో రెండు సార్లు కేంద్రమంత్రులు రైతులతో సమావేశమయ్యారు. నూతన చట్టాలపై వివరణ కూడా ఇచ్చారు. అయితే రైతులు వీటిని తిరస్కరించడంతో తాజాగా విజ్నాన్ భవన్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన మరోమారు చర్చలు జరుగుతున్నాయి.

మూడు గంటలుగా జరుగుతున్న ఈ చర్చల్లో ఆసక్తికరమైన విషయాలు వెలువడుతున్నాయి. కనీస మద్దతు ధర హామీ సహా, కొత్త సాగు చట్టాల్లో పలు సవరణలు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే సవరణలకు రైతు సంఘాలు ససేమిరా అంటున్నాయి. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. కనీస మద్దతు హామీతో మరో కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త చట్టం ముసాయిదా తయారీకి రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రధాన హామిగా చెబుతున్నాయి. రైతు కమిషన్‌లో కేవలం రైతులకు మాత్రమే స్థానం కల్పించాలని నిపుణులు, ఉన్నతాధికారులను చేర్చవద్దని రైతు సంఘం నేతలు కోరుతున్నారు. పార్లమెంట్‌లో రైతు కమిషన్ ముసాయిదాతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో చర్చల నుంచి వాకౌట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైతుల డిమాండ్లపై కేంద్రం ఓ మెట్టు దిగి సహేతుక డిమాండ్ల అమలుకు ఇబ్బంది లేదని చెబుతోంది. కనీస మద్దతు ధర చట్టం తెచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సిద్దమని తెలిపింది. ప్రైవేట్ మండీలలో రిజిస్టర్డ్ సంస్థలకే కొనుగోలు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. రైతు సవరణల కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెబుతోంది.