ఈ నెల 24-25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ఇండియాకు రానున్న సందర్భంగా ఆయన మోటార్ కేడ్ (కాన్వాయ్) అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అతి పెద్ద మోతేరా క్రికెట్ స్టేడియం వరకు సాగనుంది. లక్షలాది ప్రజలు ఆయనకు, ఆయన వెంట వచ్ఛే అధికారుల బృందానికి స్వాగతం పలుకుతారని అంచనా. అయితే.. ఈ వాహనశ్రేణి సాగే మార్గంలో పేదల మురికివాడలు ఆయనకు కనబడకుండా 4 అడుగుల ఎత్తయిన గోడను కట్టేశారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆగమేఘాల మీద ఈ పని కానిచ్చారు. క్రికెట్ స్టేడియంలో ట్రంప్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒకే వేదికను అలంకరించనున్నారు. ‘ నమస్తే ట్రంప్’పేరిట ఈ నెల 24 న ఈ ఆహ్వాన సంరంభం జరగనుంది. అయితే ఇంత హడావుడిలోనూ ఈ స్టేడియం చుట్టుపక్కల ఆవాసాలు ఏర్పరచుకున్న మురికివాడవాసుల గోడును ఆలకించేవారే లేకపోయారు. తమను తమ ఇళ్ళు, గుడిసెలు ఖాళీ చేయాలని మున్సిపల్ సిబ్బంది నోటీసులు పంపారని వారు వాపోతున్నారు. ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్న తాము ఇక ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు.
కానీ… మున్సిపల్ అధికారులు మాత్రం ఈ గోడను నిర్మించాలని తాము రెండు నెలల క్రితమే నిర్ణయించామని తెలిపారు.