
తన వయస్సు మీద అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు శరద్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన వయసు 82 అయినా, 92 అయినా తమ సమర్థత తగ్గలేదంటూ ఢిల్లీలో తమ జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత చెప్పారాయన. ఇవాళ్టి సమావేశం తమ నైతిక స్థైర్యాన్ని పెంచిందన్నారు. ఇక ఎన్సీపీ గుర్తుల కోసం పోరాటంపై తాము చెప్పేదేంటో ఎన్నికల కమిషన్ ముందే చెబుతామన్నారు శరద్పవార్. ‘పార్టీని మరింత పటిష్టం చేస్తాం. ఈ సమావేశం అందరికి మనోధైర్యాన్ని ఇచ్చింది. సమావేశం తరువాత పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. వయస్సుతో నిమిత్తం లేదు. మరింత ఉత్సాహంగా నేను పనిచేస్తా.. 82 ఏళ్లు కాదు.. నాకు 92 ఏళ్లు వచ్చినప్పటికి ఇలాగే పనిచేస్తా’ అని వ్యాఖ్యానించారు శరద్ పవార్.
ఎన్సీపీ పగ్గాల విషయంలో సంక్షోభం ఎదుర్కొంటున్న శరద్పవార్కు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మద్దతు పలికారు. ఢిల్లీలోని పవార్ ఇంటికి వచ్చి ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాజకీయ పరిస్థితులను తెలుసుకుని, పెద్దాయనకు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికే ఇతర విపక్షాలు కూడా పవార్కు మద్దతు పలికాయి. మరోవైపు ఢిల్లీలో ఎన్సీపీ కార్యాలయం బయట అజిత్పవార్కు వ్యతిరేకంగా, శరద్పవార్కు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. శరద్పవార్ను బాహుబలిగా.. అజిత్పవార్ను కట్టప్పతో పోల్చుతూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
ఎన్సీపీ ఎన్నికల సింబల్ కోసం ఈసీకి అటు శరద్పవార్ వర్గం, ఇటు అజిత్పవార్ వర్గం వినతిపత్రాన్ని అందచేశాయి. తనకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని సింబల్ను తనకే కేటాయించాలని అంటున్నారు అజిత్పవార్. జూన్ 30వ తేదీన పార్టీలో తిరుగుబాటుకు ముందే శరద్పవార్ను ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా తొలగించినట్టు ఈసీకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు అజిత్పవార్. ఇక శరద్ పవార్ వర్గం- పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడాన్ని అజిత్ పవార్ తప్పుబట్టారు. తమ అనుమతి లేకుండా పార్టీ తరపున ఇలాంటి సమావేశం నిర్వహించే అధికారం లేదని అజిత్ పవార్ వర్గం అంటోంది. మరోవైపు ఎన్సీపీ ముంబై వర్కింగ్ ప్రెసిడెంట్గా నరేంద్ర రాణేని అజిత్ పవార్ నియమించారు. ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి సత్కరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..