Navjot Singh Sidhu: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. సిద్దూకు ఏడాది కఠిన కారాగార శిక్ష

పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు జైలు శిక్ష పడింది. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Navjot Singh Sidhu: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. సిద్దూకు ఏడాది కఠిన కారాగార శిక్ష
Navjot Singh Sidhu

Updated on: May 19, 2022 | 3:24 PM

మూడు దశాబ్దాల నాటి దాడికి సంబంధించిన కేసులో  గురువారం సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది . డిసెంబరు 27, 1988న, సిద్ధూ…. గుర్నామ్ సింగ్‌ అనే వ్యక్తి  తలపై కొట్టాడని, ఆపై తీవ్ర గాయాలతో అతను మరణించాడని సిద్దూపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో గతంలో పంజాబ్‌-హర్యానా హైకోర్టు రూ.1000 జరిమానా వేసి వదిలేసింది. అయితే ఆ తీర్పును సమీక్షించాలని బాధిత కుటుంబం మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఇన్నేళ్ల పాటు విచారణ జరిగింది. తాజాగా ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం నవజ్యోత్ సింగ్ సిద్ధూకి ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

అసలు కేసు ఏంటంటే…?

1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్‌ విషయంపై 65ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌కు…. సిద్ధూ, తన ఫ్రెండ్ రూపిందర్‌ సింగ్‌లకు మధ్య గొడవ జరిగింది. గుర్నామ్‌ సింగ్‌ను కారు నుంచి బయటకు లాగి సిద్దూ- రూపిందర్‌ సింగ్  అతడిపై దాడి చేశారు. వారి దాడిలో  గుర్నామ్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే, ఈ కేసులో సిద్ధూను నిర్దోషిగా పేర్కొంటూ, రూ.1000 జరిమానా విధిస్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు 2018 మేలో తీర్పు వెల్లడించింది. దీన్ని హత్య కేసుగా పరిగణించలేమని వెల్లడించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ 2018 సెప్టెంబర్‌లో గుర్నామ్‌ సింగ్‌ కుటుంబం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసింది. దీంతో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us