
న్యూఢిల్లీ: జాతీయ గీతం (National Anthem), జాతీయ గేయం (National Song) ఆలాపన, వాయిద్య ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ (MHA) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (UT) పరిపాలనలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు తాజా ఆదేశాలు జారీ చేసింది. జూలై 9న విడుదల చేసిన అధికారిక లేఖలో రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులు, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులకు జాతీయ గీతం, జాతీయ గేయానికి సంబంధించిన ప్రస్తుత మార్గదర్శకాలను జతచేసి పంపింది. ఈ ఆదేశాల్లో ఏ సందర్భాల్లో జాతీయ గీతం, జాతీయ గేయం తప్పనిసరిగా ఆలపించాలి లేదా వాయించాలి, ఏ సందర్భాల్లో ఐచ్ఛికంగా నిర్వహించవచ్చనే అంశాలను స్పష్టంగా పేర్కొంది.
జాతీయ గేయం, జాతీయ గీతం రెండింటినీ ఒకే కార్యక్రమంలో ప్రదర్శించే పరిస్థితుల్లో ముందుగా జాతీయ గేయాన్ని ఆలపించాలి లేదా వాయించాలి. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించాలి అని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర గీతాన్ని కూడా కార్యక్రమాల్లో ఆలపించే సంప్రదాయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర గీతం, జాతీయ గేయం, జాతీయ గీతంతో కలిసి ప్రదర్శించినా జాతీయ గేయం ముందుగా, జాతీయ గీతం తర్వాత ఉండే క్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
జాతీయ గీతం, జాతీయ గేయం ఆలపించే సమయంలో అధికారికంగా ఆమోదించబడిన పదాలు, సరైన లిపి, ఉచ్చారణ, శబ్దోచ్చారణను ఖచ్చితంగా అనుసరించాలని హోంశాఖ పేర్కొంది. ఇందుకోసం ప్రామాణిక పాఠ్యం, సరైన ఉచ్చారణ వివరాలు హోంశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలకు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనలు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఎంహెచ్ఏ కోరింది. ఈ మార్గదర్శకాలపై కచ్చితమైన అమలు జరిగేలా సంబంధిత అన్ని సంస్థలు, కార్యాలయాలకు తగిన సూచనలు ఇవ్వాలి అని లేఖలో పేర్కొంది.
ఈ లేఖ ప్రతులను రాష్ట్రపతి కార్యాలయం, ఉపరాష్ట్రపతి కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సచివాలయం, భారత ఎన్నికల సంఘం, పార్లమెంట్ లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, నీతి ఆయోగ్తో పాటు ఇతర రాజ్యాంగ, ప్రభుత్వ సంస్థలకు కూడా పంపినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం కాలక్రమేణా జాతీయ గీతం, జాతీయ గేయానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తూ వస్తోందని, వాటిని దేశవ్యాప్తంగా ఏకరీతిలో అమలు చేయడమే తాజా ఆదేశాల ఉద్దేశమని పేర్కొంది.