
లక్నో, జూన్ 6: ఉత్తరప్రదేశ్లోని అలంబాగ్ ప్రాంతంలోని చందానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరి రెండున్నర ఏళ్ల బాలిక గురువారం ఉదయం అదృశ్యమైంది. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులకు మెట్రో వంతెన కింద అపస్మారక స్థితిలో చిన్నారి పడి ఉండటం గమనించారు. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు.
దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు అలంబాగ్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన 5 పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటనా స్థలానికి చేరుకుని.. అక్కడి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నిందితుడిని దీపక్ వర్మ (26)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు వినియోగించిన స్కూటర్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి, అతడిపై రూ. లక్ష రివార్డు ప్రకటించారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి తెల్లటి స్కూటర్పై అక్కడికి వచ్చాడని, మెట్రో స్టేషన్ లిఫ్ట్ వెనుకకు బాలికను తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్) ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు.
#WATCH | Lucknow, UP | Accused in the rape of a three-year-old who had a reward of Rs. 1 lakh on him, was injured in an exchange of fire with the police
(Visuals from the encounter spot) pic.twitter.com/KtCP7h3apM
— ANI (@ANI) June 5, 2025
ఈ దారుణ ఘటన జరిగిన 24 గంటల్లోపు నిందితుడు శుక్రవారం తెల్లవారుజామున అలంబాగ్ కంటోన్మెంట్లోని దేవి ఖేడా ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లొంగిపోవాలని మొదట ఆదేశించారు. అయితే నిందితుడు పారిపోయేందుకు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడ్ని లోక్బంధు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. తరచూ నేరాలకు పాల్పడే దీపక్ వర్మపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఆశిష్ శ్రీవాస్తవ వెల్లడించారు. బాధిత చిన్నారి ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతోందని, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.