
రాయచూర్, జులై 23: కర్ణాటకలోని రాయచూర్లో షాకింగ్ ఘటన జరిగింది. గోరు చిక్కుడు కూర తిని ఒకే ఇంట్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతులను రమేష్ (35), అతని కుమార్తెలు నాగమ్మ (8), దీప (6)గా గుర్తించారు. సోమవారం రాత్రి రమేష్ ఇంట్లో వండిన గోరు చిక్కుడు కాయల కూర, రోటీ, అన్నం, సాంబార్ తిన్నట్లు సమాచారం. భోజనం తర్వాత అదే రోజు తెల్లవారు జామున రమేష్ కుటుంబ సభ్యులందరూ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా.. బంధువులు లింగ్సుగూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో రమేష్, నాగమ్మ చికిత్స అందించేలోపే మరణించారు. దీప రాయచూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించింది. రమేష్ భార్య పద్మావతి, మరో ఇద్దరు పిల్లలు కృష్ణ (11), చైత్ర (10) ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన సిర్వార్ తాలూకాలోని కె. తిమ్మాపూర్ గ్రామ నివాసితులలో భయాందోళనలను సృష్టించింది.
రమేశ్ నాయక్ తన రెండెకరాల పొలంలో సీడ్ పత్తిని సాగు చేస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం పొలంలో కొంత భాగంలో కూరగాయలను సాగు చేశాడు. ఈ క్రమంలో పొలంలోకాసిన కూరగాయల్లో గోరు చిక్కుడు ఆదివారం ఇంటికి తీసుకురాగా.. సోమవారం రాత్రి వండుకుని ఆరుగురు కుటుంబ సభ్యులు తిన్నారు. మంగళవారం తెల్లవారు జామున వాంతులు, విరేచనాలు కావడంతో నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందారు. పొలంలో పంటకు పురుగుల మందు పిచికారీ చేశారని, పురుగు మందు ప్రభావం వల్లనే గోరుచిక్కుడు విషతుల్యమై ప్రాణాలు తీసి ఉంటుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కవితల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జూలై 16న కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి.. అదే పాఠశాలకు చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భోజనం తిన్న కొద్దిసేపటికే, పాఠశాలలోని పిల్లలకు వాంతులు, విరేచనాల ప్రారంభించాయి. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పిల్లలంతా అనారోగ్యానికి గురి కావడంతో జెవర్గి తాలూకాలోని మరడగి (SA) గ్రామంలోని పాఠశాల సిబ్బంది బాధిత విద్యార్థులను ప్రాథమిక చికిత్స కోసం గంగావర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.