
బెంగళూరు, మే 30: ఓ వ్యక్తి ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముగ్గురు భార్యలతో 9 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అయితే ఇంత మందిని పోషించేందుకు అతగాడు ఏకంగా దొంగగా మారాడు. సంతానంలో ఓ కుమారుడికి దొంగతనంలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. ఇక తండ్రీకొడుకులు కలిసి వరుస చోరీలకు పాల్పడుతూ ఓ కేసులో పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ విచిత్ర ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
బాబాజాన్ (35)కు ముగ్గురు భార్యలు. బెంగళూరు శివార్లలోని శ్రీరంగపట్నం, అనేకల్, చిక్కబళ్లాపురలో విడివిడిగా కాపురాలు పెట్టాడు. మొత్తం 9 మందికి తండ్రయ్యాడు. వారిలో ఎనిమిది మంది కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు భార్యలు, 9 మంది సంతానం.. పైగా వేరే వేరు సిటీల్లో కాపురాలు.. ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు బాబాజాన్ ప్రొఫెషెనల్ దొంగగా మారాడు. బెంగళూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతూ నగర వాసులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాడు. అతడి మైనర్ కుమారుడికి చోరీలు చేయడంలో శిక్షణ ఇచ్చి.. తండ్రీ కొడుకులు ఇద్దరూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మే 7న బెట్టడసనపురలోని 56 ఏళ్ల మహిళ ఇంట్లో తండ్రీకొడుకులు చోరీ చేశారు. బట్టలు ఆరవేసేందుకు మహిళ టెర్రస్ పైకి వెళ్లడంతో ఇంట్లోకి దూరి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బు దొంగిలించారు. వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు.
అలా బాబాజాన్, అతడి మైనర్ కుమారుడు పట్టుబడ్డారు. దర్యాప్తులో బాబాజాన్ సంసార సాగరం కథ వినిపించాడు. విచారణ ద్వారా 9 చోరీ కేసులను ఛేదించిన పోలీసులు.. అతడి వద్ద నుంచి 180 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి, రూ.1500 నగదు, బైక్.. పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.