
నోయిడాలోని ఒక సొసైటీలో షాకింగ్ ఘటన జరిగింది. ఆన్లైన్ ద్వారా పరిచయమైన స్నేహితులను కలవడానికి వచ్చిన ఒక యువకుడు, తాను ఉంటున్న ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి చనిపోయాడు. సెక్టార్ 74లోని నార్త్ ఐ సొసైటీలో ఈ విషాద ఘటన జరిగింది. మృతుడు ఆన్లైన్ గే యాప్ ద్వారా పరిచయమైన ఆరుగురు యువకులను కలవడానికి అక్కడికి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
అలీఘర్లోని హర్దువాగంజ్ ప్రాంతానికి చెందిన శుభం కుమార్ ఆరు నెలల క్రితం ఒక ఆన్లైన్ గే యాప్ ద్వారా ఆరుగురు యువకులతో స్నేహం పెంచుకున్నాడు. వీరంతా సెక్టార్ 74లోని నార్త్ ఐ సొసైటీలో అద్దెకు తీసుకున్న ఒక ఫ్లాట్లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో శుభం కుమార్, తాను ఉంటున్న ఎనిమిదో అంతస్తు ఫ్లాట్ బాల్కనీ నుండి కిందపడిపోయాడు. తల, శరీరానికి తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో అతడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శుభం మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆ ఫ్లాట్లో ఉన్న కొంతమంది యువకులు అంతకుముందు రాత్రే వెళ్లిపోయినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు తెలిపారు.
మృతుడి కుటుంబం నుంచి ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే శుభం మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..