బిర్యానీ షాప్ ఫ్రిజ్‌లో మనిషి శవం.. అసలు ఏం జరిగిందో తెలిస్తే షాకే..

అది ఓ బిర్యానీ షాప్. ఎప్పటిలాగే ఓనర్ ఉదయాన్నే షాపును తెరిచాడు. కానీ ఫ్రీజర్‌లో ఉన్నదాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే స్థానికులకు, పోలీసులకు ఆ విషయం తెలిపాడు. పోలీసులు రంగంలోకి ఏం జరిగింది అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు.

బిర్యానీ షాప్ ఫ్రిజ్‌లో మనిషి శవం.. అసలు ఏం జరిగిందో తెలిస్తే షాకే..
Man Body Found In Freezer In Biryani Shop

Updated on: Mar 02, 2026 | 12:13 PM

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. బక్షి కా తలాబ్ ప్రాంతంలోని ఓ బిర్యానీ షాపులో ఉన్న ఫ్రీజర్‌లో 35 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంపదీసి బిర్యానీలో కలుపుతున్నారా..? అసలు అక్కడ ఆ బాడీ ఎందుకు ఉంది..? అనే ప్రశ్నలు స్థానికుల్లో తలెత్తాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని బికెటి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్‌పూర్ మజ్రా నివాసి విజయ్ పాల్‌గా గుర్తించారు. దుకాణ యజమాని శని రావత్ తండ్రి మరణం కారణంగా గత నాలుగు రోజులుగా ఆ బిర్యానీ దుకాణం మూసివేసి ఉంది. ఆదివారం ఉదయం దుకాణాన్ని తిరిగి తెరవడానికి రావత్ వచ్చినప్పుడు ఫ్రీజర్ లోపల మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆయన స్థానికులకు సమాచారం అందించాడు.

ఒంటరితనం, వ్యసనం..

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఫ్రీజర్ నుండి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. విజయ్ పాల్ దినసరి కూలీగా పనిచేసేవాడు. ఐదు సంవత్సరాల క్రితం భార్యతో విడిపోయిన తర్వాత అతను ఒంటరిగా జీవిస్తున్నాడు. పైగా అతనికి మద్యపానానికి బానిసైనట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ADCP రిషబ్ రన్వాల్, “పోస్ట్‌మార్టంలో మరణానికి ఖచ్చితమైన కారణం నిర్ధారణ కాలేదని తెలిపారు. వ్యక్తి ఫ్రీజర్‌లోకి ఎలా ప్రవేశించాడు? ఇది హత్యనా లేక మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us