
మహారాష్ట్రలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత అమానుషమైన, సిగ్గుచేటైన సంఘటన వెలుగుచూసింది. కేవలం ఆలయ ప్రవేశం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా.. ఒకే కుటుంబానికి చెందిన మహిళలపై కొందరు దుండగులు దారుణంగా దాడి చేశారు. అంతటితో ఆగక వారి బట్టలు చించి, జుట్టు కత్తిరించి, మెడలో చెప్పుల దండలు వేసి దాదాపు రెండు కిలోమీటర్ల మేర రోడ్డుపై ఊరేగించారు. ని ఉల్హాస్నగర్లో జరిగిన కిరాతకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఉల్హాస్నగర్ క్యాంప్-3 పరిధిలోని వాఘ్రి నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కుల పంచాయతీ ఒక కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించి, వారిని స్థానిక ఆలయంలోకి రాకుండా నిషేధించింది. అయితే ఆ కుటుంబం ఈ అన్యాయమైన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఘటన జరిగిన రోజున ఆలయ ప్రాంగణంలో ఒక మతపరమైన కార్యక్రమం, సామూహిక విందు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సదరు కుటుంబానికి చెందిన ఒక యువకుడు ఆలయానికి చేరుకుని, తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమను దైవదర్శనానికి ఎందుకు అడ్డుకుంటున్నారని అక్కడి వారితో వాదించాడు. నిషేధాన్ని లెక్కచేయకుండా అతడు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టడంతో వివాదం మొదలైంది.
యువకుడి ప్రవేశంతో ఆగ్రహానికి గురైన కొంతమంది వ్యక్తులు కర్రలు, ఇనుప రాడ్లతో బాధితుల ఇంటిపైకి దూసుకెళ్లారు. మొదట ఇంట్లోని పురుషులపై విచక్షణారహితంగా దాడి చేశారు. మరుసటి రోజు ఉదయం బాధితుల కుటుంబానికి చెందిన మహిళలు ఈ దాడిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. మార్గమధ్యంలోనే నిందితులు వారిని అడ్డుకున్నారు.
మహిళలను వీధిలోకి ఈడ్చుకొచ్చి, తీవ్రంగా కొడుతూ వారి దుస్తులు చించేశారు. ప్రతీకారం తీర్చుకునే నెపంతో వారి జుట్టు కత్తిరించి, అవమానకరంగా చెప్పుల దండలు వేశారు. ఆపై వారిని రోడ్డుపై రెండు కిలోమీటర్ల దూరం నగ్నంగా ఊరేగించారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వందలాది మంది చూస్తూ నిలబడ్డారే తప్ప, ఎవరూ వారిని రక్షించడానికి ముందుకు రాలేదు. కొందరు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోవడం సమాజంలో నైతిక విలువల పతనాన్ని చాటిచెప్పింది.
ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు భారత శిక్షా స్మృతి (IPC)లోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించగా, వారిలో ఇద్దరు మహిళలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉల్హాస్నగర్ ఏసీపీ శైలేష్ కాలే తెలిపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల వల్లే ఈ ఘోరం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనపు పోలీసు బలగాలను మోహరించారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Thane, Maharashtra | A video is going viral, purportedly showing women being beaten up, stripped semi-naked, hair chopped off, and paraded with garlands of slippers over a temple entry dispute between two families of the same community at the Vitthal Wadi area of… pic.twitter.com/It5Uk9EDI2
— ANI (@ANI) May 16, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…