
కర్ణాటకలోని ధార్వాడ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రముఖ వైద్యుడు డాక్టర్ కిరణ్ హోనన్నవర్ హత్యకు గురికాగా, ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు సైతం కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ కేసులో డాక్టర్ కిరణ్ భార్య, వైద్యురాలు ప్రియాంకపై పోలీసులు హత్య ఆరోపణలు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం, డాక్టర్ కిరణ్ హోనన్నవర్ ధార్వాడ్లోని పవన్ హైస్కూల్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో భార్య ప్రియాంక, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం (జూలై 14) రాత్రి నుంచి బుధవారం వరకు కిరణ్కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఆ సమయంలో ప్రియాంక ఫోన్ ఎత్తి, కిరణ్ విశ్రాంతి తీసుకుంటున్నాడని, తర్వాత విధి నిర్వహణ కోసం బయటకు వెళ్లాడని చెప్పినట్లు సమాచారం.
అయితే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బుధవారం (జూలై 15) సాయంత్రం ఫ్లాట్కు వెళ్లగా, ఇంట్లో రక్తపు మడుగులో డాక్టర్ కిరణ్ మృతదేహం కనిపించింది. పక్కనే ఎనిమిదేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో పడి ఉండగా, ప్రియాంక మాత్రం గదిలో ప్రశాంతంగా మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న హుబ్బళ్లి–ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్, పోలీసు బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత బాలుడు మృతి చెందినట్లు భావించినప్పటికీ, కమిషనర్ అతను ఇంకా శ్వాసిస్తున్నట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రాథమిక దర్యాప్తులో ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్య, భర్త, కుమారుడు మాత్రమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బయట వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. హత్యకు గల అసలు కారణాలు, ఘటన ఎప్పుడు జరిగిందనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇంట్లోని ఆధారాలను స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ బృందం వాటిని విశ్లేషిస్తోంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రియాంకను విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే హత్యకు దారితీసిన అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..