కర్నాటక సీఎం రేసులో ఎవరు..? ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ తో భేటీ అయిన ఎడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర..
కర్నాటకలో నాయకత్వ మార్పు తప్పదని వార్తలు వస్తున్న వేళ..సీఎం ఎడ్యూరప్ప కుమారుడు బి.వై.విజయేంద్ర శనివారం ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ తో భేటీ అయ్యారు.
కర్నాటకలో నాయకత్వ మార్పు తప్పదని వార్తలు వస్తున్న వేళ..సీఎం ఎడ్యూరప్ప కుమారుడు బి.వై.విజయేంద్ర శనివారం ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ తో భేటీ అయ్యారు. ఈ నెల 26 న తాను రాజీనామా చేసే అవకాశం ఉందని ఎడ్యూరప్ప ఇదివరకే ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తాను ఎవరి పేరునూ సీఎం పదవికి సిఫారసు చేయనని, అధిష్టానం ప్రకటించే ఆదేశాలకు కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. జులై 26 తరువాత ఏం జరుగుతుందో చూద్దాం అని కూడా అన్నారు. హఠాత్తుగా అయన కుమారుడు విజయేంద్ర ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారంటే వారే ఆహ్వానించారా లేక తానే వెళ్ళారా అన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ నెల మొదటివారంలో ఎడ్యూరప్ప ఢిల్లీ వెళ్ళినప్పుడు తన కుమారుడిని కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. నాడు ప్రధాని మోదీతోను, ఇతర బీజేపీ నాయకులతోనూ మంతనాలు జరిపారు. రెండు రోజుల పాటు హస్తినలోనే ఉన్నారు.
కర్ణాటకలో లింగాయతుల మద్దతు ఎడ్యూరప్పకు పూర్తిగా ఉంది. సీఎం పదవి నుంచి ఆయనను తప్పించరాదని ఈ వర్గం గట్టిగా కోరుతోంది. ఇక కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పేరు కూడా ముఖ్యమంత్రి పదవికి వినవస్తోంది.కానీ దీని గురించి బీజేపీ నేతలెవరూ తనతో మాట్లాడలేదని, నిజానికి మీడియాలోనే ఈ ఊహాగానాలు వస్తున్నాయని ఆయన అన్నారు. దీనిపై తను స్పందించవలసిన అవసరం లేదన్నారు. ఒక వేళ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలి కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఢిల్లీ వెళ్లి పార్టీ హైకమాండ్ తో భేటీ కావడం రాష్ట్రంలో రాజకీయ సంచలనం కలిగించింది. మరి ఆయనను అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: జెఫ్ బెజోస్ తో రోదసి ట్రిప్ కి వెళ్లొచ్చిన కుర్రాడు అమెజాన్ నుంచి ఏదీ కొనలేదట ! నమ్మాలా ..?