లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి షాక్.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు

|

Feb 19, 2021 | 9:17 PM

పశువుల దాణా కుంభకోణంలో భాగమైన డుమ్కా ఖజానా కేసులో లాలూ ప్రసాద్​యాదవ్‌కు ​బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది

లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి షాక్.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు
Lalu Prasad Yadav
Follow us on

 lalu prasad yadav bail plea : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి చుక్కెదురైంది. పశువుల దాణా కుంభకోణంలో భాగమైన డుమ్కా ఖజానా కేసులో లాలూ ప్రసాద్​యాదవ్‌కు​ బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. లాలూ మరో రెండు నెలలు జైలులో ఉన్నట్లయితే సగం శిక్షాకాలం పూర్తవుతుందని ధర్మాసనం తెలిపింది. ఆ తర్వాత కొత్త పిటిషన్‌ వేయాలని హైకోర్టు సూచించింది.

పశువుల దాణా కుంభకోణం కేసుకు సంబంధించి నాలుగు కేసులకు గానూ ఇప్పటికే మూడు కేసుల్లో బెయిల్​ పొందిన లాలూ.. డుమ్కా ట్రెజరీ కేసులోనూ బెయిల్​ వస్తుందని భావించారు. అయితే.. ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం ఇందుకు నిరాకరించింది.

లాలూ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డుమ్కా ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమ ఉపసంహరణకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ లాలూను జైలుకు పంపింది. ఇందుకు సంబంధించి గత కొన్నేళ్లుగా ఆయనపై కేసు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి జాయింట్‌ అఫిడవిట్‌, లాలూ జ్యుడీషియల్‌ కస్టడీ పత్రాలను సీబీఐ గతేడాది డిసెంబర్‌లో కోర్టుకు అందించింది. ఇటీవల లాలూ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రాంచీలోని రిమ్స్‌ ఆసుపత్రి నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించగా.. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి… దేశంలో మంట పుట్టిస్తున్న చమురు ధరలు.. ఇక్కడ మాత్రం లీటర్ పెట్రోలు ధర కేవలం రూపాయి..?