Jayalalithaa Assets: జయలలిత ఆస్తులు అప్పగింత.. మొత్తం ఎన్ని కేజీల బంగారం ఉందో తెలుసా..?

కర్ణాటక సీబీఐ కోర్టు ఆధీనంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.. ప్రస్తుతం వాటి విలువ లెక్కగట్టే పనిలో ఉన్నారు అధికారులు. దివంగత జజలలిత. అవినీతి కేసులో జైలుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న కిలోల కొద్దీ బంగారం, వెండి ఇన్నాళ్లు కర్ణాటక సిబిఐ కోర్టు వద్దే ఉంది.. అయితే.. ఇప్పుడు ఆ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించడంతో వాటి లెక్కింపు మొదలైంది.

Jayalalithaa Assets: జయలలిత ఆస్తులు అప్పగింత.. మొత్తం ఎన్ని కేజీల బంగారం ఉందో తెలుసా..?
Jayalalithaa Assets

Edited By:

Updated on: Feb 15, 2025 | 12:31 PM

ఏఐడీఎంకేలో కీలకంగా ఉన్న దివంగత జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో అధికారంలోకి వచ్చిన డీఎంకే హయాంలో ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. జయలలిత దత్తపుత్రుడిగా చెప్పబడే సుధాకరన్ వివాహం 1995లో ఒక వేడుకగా అంగరంగవైభవంగా జరిగింది. ఆతర్వాత డీఎంకే అధికారంలోకి రాగానే అవినీతి అక్రమాల కేసు నమోదైంది. జయలలితతోపాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇళవరసి నలుగురిపై కూడా నమోదైంది. కేసు విచారణ తమిళనాడులో ఉంటే ప్రభావితం ఉంటుందన్న పిటిషన్ తో కర్ణాటక కోర్టుకు బదిలీ కాగా అక్కడే విచారణ జరిగింది. ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేస్తుండగా, 2014లో వారందరికీ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు అప్పీలు చేయడంతో శిక్షను రద్దు చేసింది. కానీ ఈ ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

జయలలిత సహా నలుగురికి బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే, జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5, 2016న మరణించారు. దీని తరువాత, ముగ్గురూ – శశికళ, ఇళవరసి. సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. వారి మొత్తం శిక్ష పూర్తయిన తర్వాత వారిని విడుదల చేశారు.

జయలలితపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో, ఆమె ఆస్తులన్నీ 2004లో కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయ్యాయి. మొదట తమిళనాడులో ఉన్న కేసును కర్ణాటకకు బదిలీ చేసి, అక్కడ స్వాధీనం చేసుకున్న వస్తువులను కూడా అక్కడికే తీసుకెళ్లారు. ప్రస్తుతం బెంగళూరులోని ప్రభుత్వ ఖజానాలో జయలలిత ఆస్తుల్లో పది వేల చీరలు, 750 జతల చెప్పులు, ఖరీదైన గడియారాలు, బంగారు, వజ్రాల ఆభరణాలు ఉన్నాయి.

తాజాగా సీబీఐ కోర్టు జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 27 కిలోల నగలు, 1562 ఎకరాల భూమిని ఫిబ్రవరి 14- 15 తేదీలలో తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఆదేశించింది. నగలు సహా పత్రాలను తీసుకెళ్లడానికి ఆదేశాలు వచ్చాయి.. దీంతో తమిళనాడు నుంచి ఏసీబీ అధికారులు పెట్టెలతో బెంగళూరుకు రావాలని ఆభరణాలను భద్రంగా తీసికువెళ్లేందుకు తగినంత భద్రత ఉండాలని.. ఆభరణాలను అంచనా వేయడానికి అప్రైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు సూచించారు.. ప్రతిదీ సరిచూసుకున్న తర్వాతే వాటిని ఏసీబీ అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన భద్రతా పనులను కర్ణాటక పోలీసులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. శుక్రవారం బెంగళూరు లో తమిళనాడు నుంచి వచ్చిన అధికారులకు.. జయలలితకు చెందిన ఆభరణాలు, వస్తువులు.. ఆస్తుల పత్రాలను అప్పగించారు.

జయలలిత ఆభరణాలను తిరిగి ఇచ్చే ప్రక్రియలో తమిళనాడు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజిపి విజిలెన్స్ హాజరయ్యారు. ఆభరణాలను తీసుకెళ్లడానికి 6 ట్రంక్‌లను తీసుకురాగా కోర్టు ఆదేశాలతో వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌ను తీసుకువచ్చారు. అధికారులు ఈరోజు కోర్టులోని వస్తువులను స్టాక్ చేస్తున్నారు. కర్ణాటకకు రూ. 5 కోట్ల వ్యాజ్య రుసుము ఇంకా చెల్లించాల్సి ఉంది. పట్టుచీరల విలువ కట్టేందుకు SPP కిరణ్ టెక్స్‌టైల్స్ ప్రతినిధులు, న్యాయవాదులు హాజరయ్యారు.

జయలలితకు చెందిన వస్తువుల్లో 468 రకాల బంగారం, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి. 700 కిలోల బరువున్న వెండి ఆభరణాలు, 740 ఖరీదైన చెప్పులు, 10344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీల సెట్లు, 8 VCRలు, 1 వీడియో కెమెరా, 4 CD ప్లేయర్లు, 2 ఆడియో డెక్‌లు, 24 టూ-ఇన్-వన్ టేప్ రికార్డర్, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఇనుప లాకర్లు ఉన్నాయి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us